Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మధ్యవర్తిత్వంలో ద్వంద్వ నీతి.. విశ్వసనీయత కోల్పోయిన పాకిస్థాన్
posted on: May 13, 2026 11:30AM

అంతర్జాతీయ దౌత్య వేదికలపై తనను తాను ఒక గొప్ప శాంతి కాముక దేశంగా, వివాదాలను పరిష్కరించే చాంపియన్ మీడియేటర్ గా ప్రదర్శించుకోవాలని పాకిస్థాన్ ప్రయత్నాలు ఇప్పుడు నవ్వుల పాలౌతున్నాయి. అయితే, క్షేత్రస్థాయిలో ఆ దేశం అనుసరిస్తున్న రహస్య వ్యూహాలు ప్రపంచ దేశాల ముందు పాకిస్థాన్ ను దోషిగా నిలబెట్టాయి. ముఖ్యంగా ఇరాన్, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే విషయంలో పాకిస్థాన్ ఒక పక్క రాయబారాలు నడుపుతూనే, మరోపక్క రహస్యంగా ఇరాన్ సైనిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తోందన్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ద్వంద్వ వైఖరి అటు వాషింగ్టన్, ఇటు టెహ్రాన్ రెండింటినీ తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం ఇప్పుడు ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన తరుణంలో.. ఇరాన్ సైన్యానికి చెందిన సి-130 నిఘా విమానాలు రహస్యంగా పాక్ భూభాగంలో ఉన్నట్లు అంతర్జాతీయ నిఘా వర్గాలు గుర్తించాయి. తొలుత ఈ ఆరోపణలను అవాస్తవాలంటూ బుకాయించిన పాకిస్థాన్ విదేశాంగ శాఖ.. సాక్ష్యాధారాలు బయటపడటంతో కేవలం దౌత్యపరమైన సిబ్బంది భద్రత కోసమే ఆ విమానాలు అక్కడ ఉన్నాయన్న కొత్త వాదనను తెరపైకి తెచ్చింది.
అయితే నిఘా పరికరాలతో కూడిన యుద్ధ విమానాలకు ఆశ్రయం కల్పించడం వెనుక ఇరాన్ ప్రయోజనాలను కాపాడే భారీ కుట్ర ఉందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పాకిస్థాన్ అనుసరిస్తున్న ఈ ఊసరవెల్లి దౌత్యాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది. అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం వంటి ప్రముఖులు పాక్ పాత్రను పూర్తిగా పునఃపరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్ చర్చల విషయంలో పాకిస్థాన్ వాషింగ్టన్కు తప్పుడు సమాచారాన్ని అందిస్తూ తప్పుదారి పట్టిస్తోందని అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. తమకు అనుకూలమైన ఫలితాల కోసం ఇరుపక్షాల మధ్య డబుల్ గేమ్ ఆడుతూ.. శాంతి ప్రక్రియను పాక్ అపహాస్యం చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇరాన్ సైతం ఇప్పుడు పాకిస్థాన్ను నమ్మడం లేదు. పాకిస్థాన్ భద్రతా సంస్థలు తెరవెనుక అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్తో సాగిస్తున్న రహస్య లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను టెహ్రాన్ సేకరించినట్లు తెలుస్తోంది. తమ ప్రయోజనాలను పణంగా పెట్టి పాకిస్థాన్ తమకు ద్రోహం చేస్తోందని ఇరాన్ బాహాటంగానే ఆరోపణలు గుప్పిస్తోంది. దీనివల్ల మధ్యవర్తిగా పాకిస్థాన్ పట్ల ఇటు అగ్రరాజ్యం అమెరికాకు, అటు ఇరాన్ దేశానికి ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా పూర్తిగా ఆవిరైపోయింది.
ఈ ఉద్రిక్తతలు కేవలం దౌత్య చర్చలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతున్నాయి. హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం విషయంలో పాకిస్థాన్ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ విధించిన ఆంక్షల వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇది ఆహార, ఎరువుల సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో హోర్ముజ్ జలసంధిని వివాదాలకు వేదికగా మార్చవద్దని గల్ఫ్ దేశాల కూటమి పాకిస్థాన్ కు హెచ్చరికలు జారీ చేస్తోంది. పాకిస్థాన్ ప్రదర్శించిన స్పాట్ లైట్ దౌత్యం (స్పాట్ లైట్ డిప్లమసీ) విఫలమై ఆ దేశాన్ని ఏకాకిని చేసింది. ప్రపంచ దేశాల విశ్వాసాన్ని పాకిస్థాన్ కోల్పోయింది.
ఇరాన్ ప్రతిపాదించిన 14 సూత్రాల ఒప్పందాన్ని అమెరికా అంగీకరించని పక్షంలో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది. పాకిస్థాన్ వైఫల్యాన్ని గమనించిన ఖతార్, టర్కీ, కువైట్ వంటి దేశాలు ఇప్పుడు మధ్యవర్తులుగా ముందుకు రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇది ప్రాంతీయ రాజకీయాల్లో పాకిస్థాన్ ప్రాధాన్యతను, పట్టును, విశ్వసనీయతనూ కోల్పోయిందనడానికి ప్రత్యక్ష నిదర్శనం.
భవిష్యత్తులో పాకిస్థాన్ తన దౌత్య విధానాల్లో మార్పులు చేసుకోకపోతే, అంతర్జాతీయ సమాజంలో మరింత అప్రతిష్ట పాలయ్యే ప్రమాదం ఉంది. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ద్విముఖ వ్యూహాలను అమలు చేయడం వల్ల స్నేహ దేశాల నమ్మకాన్ని కోల్పోవడమే కాకుండా, దక్షిణాసియాలో తన పట్టును కూడా కోల్పోవాల్సి వస్తుంది. మధ్యవర్తిగా ఉండాల్సిన దేశం వివాదాలను పరిష్కరించేలా ఉండాలి కానీ, వాటిని తన స్వార్ధం కోసం వాడుకోకూడదు. పాకిస్థాన్ తన డబుల్ గేమ్ విధానాన్ని వీడకపోతే, ప్రపంచ వేదికపై విశ్వసనీయత లేని దేశంగా నిలబడటం ఖాయం. ఇప్పటికే అమెరికా, ఇరాన్ వంటి కీలక దేశాలు పాక్ను దూరంగా ఉంచుతున్నాయి. ఇది ఆ దేశ ఆర్థిక, రక్షణ ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆసియా ఖండంలో శాంతి భద్రతల దృష్ట్యా పాకిస్థాన్ తన వైఖరిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






