అయోధ్య రామమందిరం.. విరాళాల సొమ్ము మాయం?

posted on: Jun 25, 2026 10:54AM

అయోధ్యలోని ప్రతిష్ఠాత్మక శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఆలయ విరాళాల లెక్కింపులో చోటుచేసుకున్న   విస్తుపోయే పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. మందిరానికి వచ్చే విరాళాల సొమ్ము మాయమవుతోందనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ఉన్నతాధికారి,  ఇద్దరు సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. అయితే..  ఈ నిధుల వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్,  రామ్ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పరస్పరం విరుద్ధమైన ప్రకటనలు చేయడం ఇప్పుడు  హాట్ టాపిక్ గా మారింది. పొలిటికల్ హీట్ ను పీక్స్ కు తీసుకెళ్లింది. ఒకవైపు సీఎం యోగి ఈ నిధుల గోల్ మాల్ ను అయోధ్య  ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రగా అభివర్ణిస్తుంటే.. మరోవైపు రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్  నృపేంద్ర మిశ్రా ఇది ముమ్మాటికీ బహిరంగ దోపిడీ అని కుండబద్దలు కొట్టారు. వీరి పరస్పర విరుద్ధ ప్రకటనలు  అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రజలలో అయోమయానికి కారణమయ్యాయి. 

ఈ నగదు గోల్ మాల్ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చిందంటే..  లెక్కింపు గదుల వెలుపల ఉన్న ఒక వాష్ రూమ్ లో కొంత నగదు   పడి ఉండటాన్ని అధికారులు గమనించారు. ఎవరో దొంగిలించి బయటకు తరలించలేక  అక్కడ వదిలేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వెంటనే ఈ విషయాన్ని చంపాత్ రాయ్ దృష్టికి తీసుకెళ్లగా..  అక్కడికి చేరుకుని పరిస్థితి  సమీక్షించారు. ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ విచారణ జరిపించాలని సిఫారసు చేశారు.  

 విరాళాల లెక్కింపు ప్రక్రియలో సుమారు 40 నుండి 45 మంది సిబ్బంది పాల్గొంటున్నారని నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. అయితే, నిబంధనల ప్రకారం లెక్కింపు గదిలోని సిబ్బంది జేబులు లేని దుస్తులు ధరించాలనే డ్రెస్ కోడ్‌ను పూర్తిగా పక్కనబెట్టారని ఆరోపించారు. సిసిటివి కెమెరాల నిఘా వైఫల్యంపై నృపేంద్ర మిశ్రా   అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో నిఘా వ్యవస్థ,  భద్రత అనేవి దాదాపు శూన్యమని, సీసీటీవీలు సమర్థవంతంగా పనిచేయలేదని  విమర్శించారు. అంతకంటే ఘోరమైన విషయం ఏమిటంటే, నిఘా కెమెరాల ఫుటేజీ కేవలం 45 రోజుల్లో ఆటోమేటిక్‌గా డిలీట్  అయిపోతుంది. దీనికి సంబంధించి ఎలాంటి  లేదా బ్యాకప్ వ్యవస్థలు లేకపోవడం వల్ల..  45 రోజుల కంటే ముందు ఏం జరిగిందనేది నిర్ధారించడం సిట్  అధికారులకు అతిపెద్ద సవాలుగా మారింది. దీనిని ఒక పద్ధతి ప్రకారం జరిగిన 'ఖులా డాకా' (బహిరంగ దోపిడీ) నృపేంద్ర మిశ్రా అభివర్ణించారు. నిధుల లెక్కింపు,  రక్షణ బాధ్యతలను ఒప్పందం ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  పూర్తిస్థాయిలో నిర్వహించాల్సి ఉందనీ, విజిలెన్స్ కోసం  శాశ్వత సిబ్బందిని నియమించడంలో బ్యాంక్ పూర్తిగా విఫలమైందని మిశ్రా ఆరోపించారు.

ఈ వివాదంపై రాజకీయ రచ్చ సాగుతుండగా..  సీఎం యోగి ఆదిత్యనాథ్   దీనిని తీవ్రంగా ఖండించారు.  , ఐదు శతాబ్దాల పోరాటం తర్వాత హిందూ సమాజం ఎంతో పవిత్రంగా సాధించుకున్న రామాలయంపై, అయోధ్యపై ప్రశ్నలు సంధించడం, అనుమానాలు రేకెత్తించడం అయోధ్యను అవమానిం చడమేనన్నారు.   ప్రతిపక్షాలు,  కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్రగా ఈ వ్యవహారిన్ని అభివర్ణించడం ద్వారా రాజకీయ లబ్థి కోసం ఆయన చేసిన ప్రకటన మరింత వివాదాస్పదంగా మారింది.  అయితే నృపేంద్ర మిశ్రా మాత్రం ప్రభుత్వం చెబుతున్న గణాంకాలను కూడా తప్పుబట్టారు. గత ఏడాది కాలంలో 16 కోట్ల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారని ప్రభుత్వం చెబుతున్న లెక్కలు అతిశయోక్తిగా ఉన్నాయని, నిజమైన సంఖ్యను మాత్రమే మీడియాకు వెల్లడించాలని   డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంతర్గత విభేదాలు రామ్ మందిర ప్రతిష్ఠకు భంగం కలిగిస్తాయనే ఆందోళన భక్తులలో వ్యక్తమవుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...