భారత ఆర్థిక వృద్ధికి అవరోధాలేంటో తెలుసా?

posted on: Apr 22, 2026 2:55PM

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మందగమనంలో ఉన్నప్పటికీ..  ఇండియా తిరుగులేని వృద్ధిని కనబరుస్తూ గ్లోబల్ ఎకానమీకి ఒక ప్రధాన ఇంజిన్‌లా మారుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి  సంస్థ   విశ్లేషణల ప్రకారం, భారత్ తన ఆర్థిక పటిష్టతను చాటుకుంటూ ప్రపంచ సగటు కంటే రెండింతల వేగంతో దూసుకుపోతోంది. అయితే..  ఈ గణనీయమైన ప్రగతి  దీర్ఘకాలం పాటు కొనసాగించాలంటే దేశీయంగా ఉన్న కొన్ని  లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.  గడిచిన కొన్నేళ్లుగా భారత వాస్తవ జీడీపీ వృద్ధి సగటున 7.7 శాతంగా నమోదవుతోంది. ముఖ్యంగా పొరుగు దేశమైన చైనా 4.6 శాతం వృద్ధి వద్ద ఆగిపోగా, ఇతర వర్ధమాన దేశాలు 3.4 శాతానికే పరిమితమయ్యాయి. భారత్ ఈ స్థాయిలో రాణించడానికి ప్రధాన కారణం దేశీయంగా ఉన్న బలమైన డిమాండ్ అని ఐఎంఎఫ్ చెబుతోంది. 

ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం..  ప్రజల వినియోగం పెరగడం,  స్థిరమైన పెట్టుబడులు దేశ ఆర్థిక రథాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ఇక ఇండియాకు ఉన్న మరో  సానుకూల అంశం ఇక్కడి యువ జనాభా. దేశ జనాభాలో సుమారు 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే కావడం వల్ల భారత్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద శ్రామిక శక్తి అందుబాటులో ఉంది. పాశ్చాత్య దేశాలు,  చైనా క్రమంగా వృద్ధాప్య సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో..  భారత యువశక్తి ఉత్పాదకతను పెంచడానికి ఒక గొప్ప అవకాశంగా మారింది.  దీనికి తోడు గత దశాబ్ద కాలంలో చేపట్టిన డిజిటల్ మౌలిక వసతుల కల్పన, పన్ను సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మెరుగైన ర్యాంకింగ్ వంటివి   పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. 

అయినప్పటికీ, దేశ ఆర్థిక పురోగతికి కొన్ని సవాళ్లు ఉన్నాయి.  జీడీపీలో తయారీ రంగం వాటా కేవలం 15 శాతం కంటే తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అదే జపాన్ 35 శాతం, చైనా 30 శాతం,  తో పోలిస్తే  ఇండియా ఈ విషయంలో వెనుకబడి ఉంది. కేవలం కేవలం సేవా రంగంపైనే ఆధారపడి వృద్ధిని సాధించడం దీర్ఘకాలంలో సాధ్యం కాకపోవచ్చని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. దీనికి తోడు అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. గత ఏడాది కాలంలో రూపాయి విలువ గణనీయంగా క్షీణించడం వల్ల చమురు, గ్యాస్, బంగారం దిగుమతుల భారం పెరుగుతోంది. భవిష్యత్తు అంచనాలను పరిశీలిస్తే..  2026 నాటికి భారత వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా. 

అదే సమయంలో చైనా వృద్ధి 4.4 శాతానికి పడిపోయే అవకాశం ఉందని అదే ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక భారాన్ని మోసే బాధ్యత భారత్‌పైనే ఉంది. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలంటే భారత్ హరిత ఇంధన రంగం వైపు వేగంగా అడుగులు వేయాలి. శిలాజ ఇంధనాల దిగుమతులను తగ్గించుకోవడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు, తద్వారా రూపాయి విలువను స్థిరీకరించవచ్చు.  చైనాకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించాలంటే తయారీ రంగాన్ని భారీగా విస్తరించడం తప్పనిసరి. ఎగుమతులు పెరిగి, విదేశీ పెట్టుబడులు ప్రవహించినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది.  

- సీతారాం కంఠంనేని 

google-ad-img
    Related Sigment News
    • Loading...