నెక్స్ట్ టార్గెట్.. భోగాపురం టు అమెరికా డైరెక్ట్ ఫ్లైట్.!

posted on: Aug 3, 2026 12:02PM

 ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో  ఏపీ అభివృద్ధిలో ఒక అద్భుత అధ్యాయానికి తెరతీసింది.  ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ  గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్  రాష్ట్ర రవాణా రంగానికి సరికొత్త వెలుగులు తెచ్చింది.  ఇక ఈ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు డైరెక్ట్ ఫ్లైట్ నెక్స్ట్ టార్గెట్ కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి రాగానే..   ప్రపంచవ్యాప్తంగా  ఉన్న లక్షలాది మంది ఆంధ్రులు.. మరీ ముఖ్యంగా  ముఖ్యంగా అమెరికాలో ఉన్న   ఎన్నారైలకు కొత్త ఆశలు చిగురించాయి.   ప్రపంచస్థాయి మౌలిక వసతులతో సిద్ధమైన భోగాపురం విమానాశ్రయం నుంచి నేరుగా అమెరికాకు అంతర్జాతీయ విమాన సర్వీసులు అతి త్వరలో ప్రారంభమౌతాయన్నదే ఆ ఆశ.  

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విదేశాలకు ప్రయాణించే పౌరులకు రవాణా వ్యవస్థ పరంగా   ఇబ్బందులు ఉన్నాయి. ఐటీ ఉద్యోగాలు, ఉన్నత విద్య, వ్యాపారాలు, ఉపాధి నిమిత్తం ఏటా  ఏపీకి చెందిన వేలాది మంది ప్రవాస భారతీయులు అమెరికాకు ప్రయాణిస్తుంటారు. అలాగే స్వదేశంలో ఉన్న  ఎన్నారైల తల్లిదండ్రులు, బంధువులు  తరచూ అమెరికాకు  వెళ్లి వస్తుంటారు. అయితే.. ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్ పరిధిలో నేరుగా విదేశాలకు వెళ్లే  విమాన సర్వీసులు (లాంగ్-హాల్ ఫ్లైట్స్) లేకపోవడం వల్ల   హైదరాబాద్,  చెన్నై,  బెంగళూరు లేదా   ఢిల్లీ విమానాశ్రయాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. 

ఆయా నగరాలకు రోడ్డు లేదా రైలు మార్గాల ద్వారా చేరుకుని, అక్కడ గంటల కొద్దీ లేఓవర్ సమయాన్ని వెచ్చించి అంతర్జాతీయ విమానాలు ఎక్కడం వల్ల వారికి సమయంతో పాటు ఆర్థికంగానూ  భారం పడుతోంది. ఈ నేపథ్యంలోనే  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందని ఆశిస్తున్నారు.  భోగాపురం ఎయిర్‌పోర్ట్ కేవలం ఒక ప్రాంతీయ రవాణా కేంద్రంగా మాత్రమే కాకుండా, అంతర్జాతీయ విమానయాన హబ్‌గా ఎదిగేందుకు అన్ని అర్హతలూ ఉన్న విమానాశ్రయం. పెద్ద విమానాలు సునాయాసంగా ల్యాండ్ అయ్యేలా నిర్మించిన విశాలమైన రన్‌వేలు, అత్యాధునిక టెర్మినల్ భవనాలు, కార్గో హ్యాండ్లింగ్ సిస్టమ్స్ వంటి వసతులు ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. 

ఈ వసతుల ద్వారా భోగాపురం నుంచి నేరుగా అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు రాకపోకలు సాగించే అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆకర్షించేందుకు బలమైన పునాది ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు   భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ఉత్తరాంధ్ర ప్రగతికి గేట్‌వేగా అభివర్ణించారు. ఇప్పుడు ఇక తదుపరి టార్గెట్ గా అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఇక్కడ నుంచి నేరుగా విమాన సర్వీసులను నడపడమే కావాలని ఆంధ్రులు కోరుతున్నారు.

ఆ దిశగా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు.  ఇటీవల యూరోప్ పర్యటన సందర్భంగా  కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడి తెలుగు డయాస్పోరాతో నిర్వహించిన సమావేశంలో  ఐరోపా, అమెరికా సహా  ముఖ్యమైన ప్రపంచ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు నేరుగా విమాన సర్వీసులు నడిచేలా చర్యలు తీసుకుంటామని విస్పష్ట హామీ ఇచ్చిన సంగతి తెలిసందే.

ఇప్పుడు   భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చేసింది కనుక, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ద్వారా వివిధ అంతర్జాతీయ విమానయాన సంస్థలతో చర్చలు జరిపి, నేరుగా సర్వీసులు ప్రారంభించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని తెలుగు ప్రజలు కోరుతున్నారు.   అంతర్జాతీయ కనెక్టివిటీ మెరుగుపడటం వల్ల కేవలం ప్రయాణికులకు మాత్రమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా  ఐటీ ,  టూరిజం , విదేశీ పెట్టుబడులకు, ఎగుమతులకు భారీ స్థాయిలో ప్రోత్సాహం లభిస్తుంది.    

 Bhogapuram International Airport, Chandrababu Naidu, Ram Mohan Naidu, AP Direct Flights to US, Visakhapatnam Aviation Development

google-ad-img
    Related Sigment News
    • Loading...