వెంకయ్య - కిషన్ రెడ్డి మధ్య అగాథం
posted on: Dec 20, 2014 1:10PM
వాళ్ళిద్దరూ గురు శిష్యులు. అయితే ఇప్పుడు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికారానికి దూరంగా ఉన్నంతకాలం ఒకరికి ఒకరు దగ్గరగా వున్నారు. ఇప్పుడు అధికారం దగ్గరగా వచ్చిన తర్వాత వారిద్దరూ దూరమైపోయారు. కలసికట్టుగా దేశాన్ని ముందుకు నడిపించాల్సిన వారు ఎడమొహం పెడమొహంగా వుంటున్నారు. వాళ్ళిద్దరూ ఎవరో కాదు... బీజేపీ జాతీయ నాయకుడు, కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి.
వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి... ఇద్దరి మధ్య ఏం జరిగిందో, ఏ అభిప్రాయ భేదాలు వచ్చాయో గానీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. గతంలో వెంకయ్య నాయుడు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చినా, ఏ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి అక్కడకి తప్పకుండా వచ్చేవారు. అధికార కార్యక్రమం అయినా, అనధికార కార్యక్రమం అయినా కిషన్ రెడ్డి హాజరు తప్పనిసరిగా కనిపించేది. అయితే ఇటీవలి కాలంలో వెంకయ్య నాయుడు ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా కిషన్ రెడ్డి అక్కడ కనిపించడం లేదు. బీజేపీ జాతీయ స్థాయి నాయకుడు వచ్చినప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి హోదాలో వున్న కిషన్ రెడ్డి వెళ్ళి కలవటం మర్యాద. ఆ మర్యాదని కూడా కిషన్ రెడ్డి పాటించనంతగా వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది. కిషన్ రెడ్డికి రైట్ హ్యాండ్గా భావించే యన్నం శ్రీనివాసరెడ్డి ఆమధ్య వెంకయ్య నాయుడిని విమర్శించినప్పుడు కూడా కిషన్ రెడ్డి ఆ విమర్శలను ఖండించకుండా మిన్నకున్నారు. బీజేపీ లాంటి క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఇలాంటి ధోరణులు కుదరవు. అయినప్పటికీ కిషన్ రెడ్డి ఇదే పంథాలో వ్యవహరిస్తున్నారు.
కిషన్ రెడ్డి వ్యవహార శైలి వెంకయ్య నాయుడికి నచ్చకపోయినప్పటికీ ఆయన ఈ అంశాన్ని నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్ళ దలచుకోనట్టు తెలుస్తోంది. ఎందుకంటే, నరేంద్రమోడీ వెంకయ్య నాయుడికి ఎంత సన్నిహితుడో కిషన్ రెడ్డికి కూడా అంతే సన్నిహితుడు. దశాబ్దాల క్రితం ఇద్దరూ కలసి భారత ప్రభుత్వం తరఫున అమెరికా పర్యటనకు వెళ్ళిన స్నేహం కూడా వీరిమధ్య వుంది. అందువల్ల కిషన్ రెడ్డి వ్యవహార శైలిని మోడీ దృష్టికి వెంకయ్య తీసుకెళ్ళలేదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని వెంకయ్య నాయుడు ప్రోత్సహిస్తున్నట్టు, కిషన్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. చింతల రామచంద్రారెడ్డిని వెంకయ్య భుజాన వేసుకోవడం ఎంతవరకూ వచ్చిందంటే, త్వరలో ఆయనకు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేనంత వరకు వచ్చింది. ఏది ఏమైనప్పటికీ వెంకయ్య లాంటి నాయకుడితో కిషన్ రెడ్డి అనవసరంగా దూరాన్ని పెంచుకుంటున్నారేమోనన్న అభిప్రాయం తెలంగాణ బీజేపీ వర్గాల్లో వినిస్తోంది.




.jpg)

.webp)



