Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పేపర్ లీకేజీలపై ఆనాడు ఆందోళన.. నేడు అణచివేత..!
posted on: Jul 22, 2026 7:50PM

నీట్ వివాదం వేళ విద్యాశాఖ మంత్రి పాత పోరాటాలు..!
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతున్నాయి. అయితే, సరిగ్గా ఇలాంటి సమయాన్నే ప్రతిబింబించేలా ఆయనకు సంబంధించిన మూడు దశాబ్దాల క్రితం నాటి పోరాట చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
సుమారు 27 ఏళ్ల క్రితం విద్యార్థి నేతగా ఉన్న సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీకులకు వ్యతిరేకంగా స్వయంగా ఉద్యమించారు. పరీక్షల పారదర్శకత కోసం నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి, పోలీసుల లాఠీ దెబ్బలు కూడా తిన్న ఘటనలు ఇప్పుడు మళ్లీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
గతంలో 1997లో ఒడిశాలో భారీ స్థాయిలో క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఉదంతం వెలుగుచూసింది. ఆ సమయంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్.. ఈ అక్రమాలపై తీవ్ర స్థాయిలో తిరుగుబాటేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ నిరసన గళం విప్పారు.
ఒడిశా సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన ఆయన, సుమారు 1,500 మంది విద్యార్థులను ముందుండి నడిపించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ సెక్రటేరియట్ ఎదుట బారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. ధర్నాను విఫలం చేసేందుకు పోలీసులు జరిపిన తీవ్ర లాఠీఛార్జిలో ధర్మేంద్ర ప్రధాన్కు తీవ్ర గాయాలై ఎముకలు విరిగినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా విద్యార్థి హక్కుల కోసం ఆయన పోరాటాన్ని కొనసాగించారు. నాటి లాఠీఛార్జి సంఘటనలకు సంబంధించిన పాత చిత్రాలు, పత్రికా ప్రకటనలు ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆనాడు పేపర్ లీకేజీల వ్యవస్థపై సింహంలా గర్జించిన నేత.. నేడు విద్యాశాఖ మంత్రిగా అదే లీకేజీల వివాదాన్ని ఎదుర్కోవడం విధి వైపరీత్యమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం నీట్, నెట్ పరీక్షల అక్రమాలపై సుప్రీంకోర్టుతో పాటు సిబిఐ విచారణలు కొనసాగుతున్న తరుణంలో ఈ పాత వార్తలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి, లీకేజీల రాకెట్ను అరికట్టడానికి విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రితో పాటు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
ఈ నేపథ్యంలో, ఆనాడు విద్యార్థి నేతగా పోరాడిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత లీకేజీల సమస్యకు ధర్మేంద్ర ప్రధాన్ శాశ్వత పరిష్కారం చూపుతారా లేదా అని దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Dharmendra Pradhan Paper Leak, NEET Leak Controversy, ABVP Dharmendra Pradhan 1997, Union Education Minister, Odisha Secretariat Protest






