శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
posted on Aug 16, 2025 9:13AM
.webp)
కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వేంకటేశ్వరుని దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వరుస సెలవులు, వారాంతం కావడంతో తిరుమల భక్తజన సంద్రంగా మారింది. శనివారం (ఆగస్టు 16) ఉదయం శ్రీవారిద దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ ఆక్టోపస్ భవనం వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (ఆగస్టు 15) స్వామివారిని మొత్తం 77,043 మంది దర్శించుకున్నారు. వారిలో 41,859 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చింది. ఇక పెద్ద సంఖ్యలో క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ జల, అన్న ప్రసాదాలను అందిస్తున్నది.