దేశ సమగ్రతే జనసేన ఆత్మ : డిప్యూటీ సీఎం పవన్

posted on: Jun 15, 2026 4:23PM

 

దేశ సమగ్రత, జాతీయ సమైక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమని జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులపై రాజీ లేకుండా పోరాడతామని, దేశ ప్రయోజనాలే పార్టీకి తొలి ప్రాధాన్యమని తెలిపారు.

ఢిల్లీలో నిర్వహించిన ‘జాతీయ సమైక్యత కోసం.. సేన ప్రస్థానం’ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధికారం లేదా పదవుల కోసం కాకుండా దేశ సమగ్రతను కాపాడాలనే లక్ష్యంతో ఏర్పాటైందన్నారు. “దేశమే ఫస్ట్.. మిగతావన్నీ నెక్స్ట్” అనేది జనసేన విధానమని స్పష్టం చేశారు.

దేశ రాజధాని ఢిల్లీ త్యాగాలకు, స్వాతంత్ర్య పోరాటాలకు, దేశభక్తికి ప్రతీక అని పేర్కొన్న ఆయన, ప్రతి భారతీయుడి కలలు ఢిల్లీతో ముడిపడి ఉన్నాయని అన్నారు. దేశాన్ని విభజించే భావజాలాలు, ప్రాంతీయ విద్వేషాలు, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే శక్తులను జనసేన ఎప్పటికీ ఉపేక్షించదని హెచ్చరించారు.

జనసేన సిద్ధాంతాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయని, కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి కూడా పార్టీ భావజాలానికి ఆదరణ లభిస్తోందని తెలిపారు. భిన్న ప్రాంతాలను, భిన్న వర్గాలను దేశభక్తి అనే ఒకే తాటిపైకి తీసుకురావడమే జనసేన లక్ష్యమన్నారు.

తెలంగాణ ఏర్పాటును జనసేన ఎప్పుడూ వ్యతిరేకించలేదని, అయితే రాష్ట్ర విభజనను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన తీరును మాత్రమే ప్రశ్నించామని చెప్పారు. విభజన ప్రక్రియలో జరిగిన లోపాల వల్లే ఇప్పటికీ సమస్యలు కొనసాగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

దేశానికి హాని చేసే శక్తులు ఎంత చిన్నవైనా వాటిని తేలికగా తీసుకోవద్దని పేర్కొన్న పవన్ కళ్యాణ్, దేశ సమగ్రతకు భంగం కలిగించే ప్రతి చర్యను జనసేన బలంగా అడ్డుకుంటుందని అన్నారు. దేశ విభజనవాదాన్ని ప్రోత్సహించే వారిపై పార్టీ గళం ఎప్పుడూ బలంగానే ఉంటుందన్నారు.

పార్లమెంట్‌లో జనసేనకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలకు ప్రత్యేక బాధ్యత ఉందని, కేవలం నియోజకవర్గ సమస్యలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ అంశాలపై కూడా గళం వినిపించాలని సూచించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ దేశ ప్రయోజనాల కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.

జెన్-జీ తరానికి దేశభక్తి, రాజ్యాంగ విలువలు, బాధ్యతాయుత పౌరసత్వం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు, నీతివంతమైన పాలన ఎలా ఉండాలో జనసేన చూపిస్తుందని, దేశానికి బలమైన పునాదులు వేయడమే పార్టీ లక్ష్యమని పవన్ కళ్యాణ్ అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...