Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నేరస్థుడికి కులం, మతం ఉండవు...కులాల దరిద్రం పోతేనే రాష్ట్రం అభివృద్ధి : పవన్
posted on: Jun 21, 2026 12:43PM
.webp)
సమాజంలో నేరస్థులను కేవలం నేరస్థులుగానే చూడాలని, వారికి కులం లేదా మతం అనే ముసుగు వేయకూడదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే కుల రాజకీయాల నుంచి బయటపడాల్సిన అవసరం ఉందన్నారు. నేరం చేసిన వ్యక్తికి ఎలాంటి కులం, మతం ఉండదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించకూడదని హెచ్చరించారు.
శనివారం రాత్రి కాకినాడలో నిర్వహించిన ‘మన ఊరు – మాట మంతి’ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పలు కీలక అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదని స్పష్టం చేశారు. క్రిమినల్ గ్యాంగుల ఆధారంగా రాజకీయాలు చేయడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అధికార వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు.
“క్రిమినల్స్ చేతిలో అధికారం ఉంటే ప్రజల భవిష్యత్తు మంటగలుస్తుంది. శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి వెనుకంజ ఉండదు” అని అన్నారు.
ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తాను
నేరపూరిత నేపథ్యం ఉన్న వ్యక్తులు రాజ్యాంగబద్ధమైన పదవులను అధిష్టించి ప్రజల జీవితాలను ప్రభావితం చేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అలాంటి శక్తులపై నిరంతరం పోరాడేందుకు తాను సిద్ధంగా ఉంటానన్నారు. “వచ్చే ఎన్నికల్లో గెలుస్తానో లేదో నాకు తెలియదు. కానీ ప్రజల కోసం పోరాడటం మాత్రం ఆపను. వ్యవస్థలు బలంగా ఉండాలని కోరుకుంటాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే నా లక్ష్యం” అని తెలిపారు.
తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసులను అడ్డుకోవాలి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నిజమైన బాధితులకు న్యాయం జరగాలంటే తప్పుడు కేసులను కూడా అదే స్థాయిలో అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
“డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్పై నిజమైన గౌరవం ఉన్నవారు ఎప్పుడూ తప్పుడు కేసులు పెట్టరు. అసలైన బాధితులకు న్యాయం జరగకుండా చేసే తప్పుడు కేసులు సమాజానికి హానికరం. కూటమిలోని నాయకులు కూడా ఇలాంటి అంశాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అని సూచించారు. సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేసిందని గుర్తు చేశారు.
సుగాలీ ప్రీతి కేసులో సాక్ష్యాలు మాయం
2017లో జరిగిన సుగాలీ ప్రీతి అనుమానాస్పద మరణం కేసును ప్రస్తావించిన పవన్ కళ్యాణ్, బాధితురాలికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించామని చెప్పారు. ఆ సమయంలో లక్షన్నర మందితో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
“ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ బలంగా వినిపించింది. అయితే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం కేవలం లేఖలు రాసి చేతులు దులుపుకుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుపై దృష్టి సారించాలని భావించాం. కానీ అప్పటికే కీలక సాక్ష్యాధారాలు చెరిపివేయబడ్డాయి. డీఎన్ఏ నమూనాలు కూడా మాయం చేయబడ్డాయి” అని ఆరోపించారు.
కోర్టులు సాక్ష్యాధారాల ఆధారంగానే పనిచేస్తాయని, ఆధారాలు లేకుండా న్యాయం సాధించడం కష్టమని పేర్కొన్నారు.
వివేకానందరెడ్డి హత్య కేసు ప్రస్తావన
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. హత్య ఎవరు చేశారనే విషయంపై ప్రజల్లో అవగాహన ఉన్నప్పటికీ, కోర్టులో నిరూపించేందుకు కచ్చితమైన సాక్ష్యాలు అవసరమని అన్నారు. “చట్టం ముందు సాక్ష్యాలే కీలకం. ఒక తల్లి తన కుమారుడు కనిపించడం లేదని కోర్టును ఆశ్రయించడం రాజ్యాంగం కల్పించిన హక్కు. అలాంటి విషయాలకు కులాన్ని ముడిపెట్టడం సరైంది కాదు. నేరాలను కుల కోణంలో చూడటం సమాజానికి ప్రమాదకరం” అని పేర్కొన్నారు.
వితంతువుల ఇళ్ల పట్టాలను కూడా వదల్లేదు
కాకినాడలోని చిన్నస్వామి నగర్లో జరిగిన భూ ఆక్రమణల అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 63 మంది నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మంజూరు చేసిందని, అయితే తరువాత కొంతమంది ప్రభావశీలుల అనుచరులు ఆ పట్టాలను బలవంతంగా లాక్కొని ఇతరుల పేర్లకు బదిలీ చేశారని ఆరోపించారు.
“బాధితుల్లో వితంతువులు, దివ్యాంగులు, క్యాన్సర్ రోగులు కూడా ఉన్నారు. వారిని కూడా వదల్లేదు. ఇదే ప్రాంతంలో ఒక మార్వాడీ కుటుంబానికి చెందిన విలువైన ఆస్తులను కూడా ఆక్రమించారు. వేధింపులు తట్టుకోలేక ఆ కుటుంబం కాకినాడను విడిచి వెళ్లిపోయింది” అని తెలిపారు.
భిన్నాభిప్రాయాలను అణచివేయడం సహించం
సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిని బెదిరించే సంస్కృతిని సహించబోమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
“ఇళ్లలోకి వస్తామని, మహిళలను వేధిస్తామని బెదిరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే వారిని చట్టం ముందు నిలబెడతాం” అని స్పష్టం చేశారు. గతంలో కోనసీమ జిల్లాకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టడంపై అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిని బెదిరించిన ఘటనలను గుర్తు చేస్తూ, అప్పటి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
కుల రాజకీయాలకు స్వస్తి పలకాలి
తనను పదేపదే కుల రాజకీయాల చట్రంలో బంధించేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు.
“నేను దేశం గురించి మాట్లాడితే నన్ను కులానికి పరిమితం చేస్తారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కుల రాజకీయాల దరిద్రం పోవాలి. ప్రజల సమస్యలు, యువత భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన నాయకులు ఇంకా కుల ఓట్ల లెక్కలలోనే మునిగిపోతున్నారు” అని వ్యాఖ్యానించారు. జనసేన ప్రజాప్రతినిధులు ఎక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగినా గళం విప్పాలని ఆయన సూచించారు.
నేరాలను కులంతో సమర్థించొద్దు
నేరాలు చేసిన వ్యక్తులను కుల ప్రాతిపదికన సమర్థించడం ప్రమాదకర ధోరణి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
“ఒక క్రిమినల్ నేరం చేస్తే దానికి మొత్తం కులాన్ని బాధ్యులను చేయలేం. అలాగే నేరం చేసిన వ్యక్తిని కులం పేరుతో సమర్థించకూడదు. బాధితులకు కూడా హక్కులు ఉంటాయి. నేరస్తుల హక్కుల గురించి మాత్రమే మాట్లాడి బాధితులను మర్చిపోవద్దు” అని అన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో కులాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటే ఉపేక్షించబోనని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ అనంతబాబు కాపు కలస్తుడంట, అతను దళిత కులానికి చెందిన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అప్పుడు ఎవరికీ కులాలు గుర్తుకు రావు. ఒక క్రిమినల్ చనిపోతే దానికి నన్ను లాగుతారు. మనకి 164 సీట్లు వచ్చాయంటే యువత రోడ్ల మీదకి వస్తేనే వచ్చాయి. ప్రతిదానికీ కులం ఓట్లు పోతాయంటే ఎలా? ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేస్తే అది కాపులందరికీ చెడ్డపేరా? కులం దరిద్రం వదిలితే తప్పు ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. యువత భవిష్యత్తు అడుగుతుంటే, నాయకులు అవన్నీ ఆలోచించడం లేదని పవన్ తెలిపారు.
యువత భవిష్యత్తు గురించి ఆలోచించాలి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం యువతను సరైన దిశలో నడిపించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. “ప్రతి అంశాన్ని కుల రాజకీయాల కోణంలో చూస్తే రాష్ట్రం ముందుకు వెళ్లదు. యువత భవిష్యత్తు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి గురించి చర్చ జరగాలి. లా అండ్ ఆర్డర్ను కాపాడితే కుల ఓట్లు పోతాయా అని భయపడితే ఎవరు పని చేస్తారు?” అని ప్రశ్నించారు.
నేరస్థులను సమర్థించడం ప్రమాదకరం
తక్కువ వయసులో నేరాలు చేశారని, తెలిసీ తెలియని వయసు అని చెప్పి నేరస్థులను సమర్థించడం ప్రమాదకరమని పవన్ కళ్యాణ్ అన్నారు.“నేరాన్ని నేరంగానే చూడాలి. పాపం చిన్న వయసులో చేశాడని సమర్థిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అలాంటి వారిని ప్రోత్సహిస్తే రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది” అని హెచ్చరించారు.
వ్యవస్థలను బలోపేతం చేయడమే లక్ష్యం
కాకినాడలో అధికారుల నియామకాల విషయంలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు.
“ఎవరు ఎస్పీగా ఉండాలి, ఎవరు కలెక్టర్గా ఉండాలి అని నేను చెప్పలేదు. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలి, వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయాలి అని మాత్రమే సూచించాను. నా పార్టీ నాయకులు అయినా తప్పు చేస్తే ప్రోత్సహించను. నేను వ్యవస్థలను బలపరచడానికి ఉన్నాను, బలహీనపరచడానికి కాదు” అని స్పష్టం చేశారు.
క్రిమినల్స్కు ఒకే ఒక్క సందేశం ఇస్తున్నానని, ఎవరైనా తమను రక్షిస్తారని భావించి నేరాలకు పాల్పడితే అది పెద్ద పొరపాటు అవుతుందని హెచ్చరించారు. “తప్పు చేసినవారిని ఏ పార్టీ, ఏ నాయకుడు రక్షించలేడు. చట్టం తన పని తాను చేస్తుంది” అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.






