చంద్రబాబు జైలుకెళ్లినప్పుడే సీఎం అయ్యేవాడిని : పవన్ కల్యాణ్

posted on: May 25, 2026 9:06PM

 

రాజకీయాల్లోకి తాను అన్నీ కోల్పోవడానికి సిద్ధపడే వచ్చానని, అంతేగానీ ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవడానికి సిద్ధంగా లేనని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కొన్ని వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాల వేదికలుగా జరుగుతున్న వ్యక్తిగత విమర్శలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమపై వ్యక్తిగత దాడికి దిగితే తాము కూడా అదే స్థాయిలో వ్యూహాత్మక ఎదురుదాడి చేస్తామని వైరి వర్గాలను హెచ్చరించారు.

రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన జనసేన అంతర్గత నేతలు, శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికగా కొందరు పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఎక్కడ ఎలాంటి వివాదాలకు దిగుతారో మీ ఇష్టం, దేనికైనా నేను సిద్ధం. నిర్ణయం మీకే వదిలేస్తున్నా.. నన్ను మాత్రం అనవసరంగా రెచ్చగొట్టవద్దు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ విశ్లేషణల పేరుతో కొందరు పనిగట్టుకుని చేస్తున్న పిచ్చి లాజిక్కులను పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ఎండగట్టారు. మాజీ సీఎం జగన్‌ను జైలుకు పంపాలని తాను కోరుకుంటున్నట్లు కొందరు ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. జగన్ జైలుకు వెళ్తే తనకు వచ్చే రాజకీయ లాభం ఏమీ లేదన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సమయంలో తాను స్వార్థంతో ఆలోచించి ఉంటే అప్పుడే సీఎం అయ్యేవాడినని గుర్తుచేశారు.

తన రాజకీయ సిద్ధాంతాలు ఎప్పుడూ విభిన్నంగా ఉంటాయని జనసేనాని స్పష్టం చేశారు. శత్రువు అన్ని రకాలుగా బలంగా ఉన్నప్పుడే తాము దెబ్బకొడతామని, అతడు బలహీనపడినప్పుడు కాదని పేర్కొన్నారు. విశ్లేషణలు చేసే వారిని తాము ప్రశ్నిస్తే.. వెంటనే కొందరు కులం కార్డును తెరపైకి తీసుకురావడం ఏంటని నిలదీశారు. తమ మితిమీరిన సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని, మౌనం వెనుక బలమైన వ్యూహం దాగి ఉందన్నారు.

పార్టీ నడవాలంటే పటిష్టమైన క్రమశిక్షణ ఎంతో అవసరమని, అప్పుడే కూటమి ప్రభుత్వంలో జనసేనకు సరైన గుర్తింపు, బలం లభిస్తుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పార్టీలో పదవులు దక్కించుకున్న కొందరు నేతలు ఉత్సాహంగా పనిచేయడం మానేసి పెద్దమనుషుల తరహాలో మౌనంగా ఉండిపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం పదవుల కోసమే అనుకుంటే జనసేనలో కొనసాగాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.

మరోవైపు కూటమి ప్రభుత్వం సజావుగా సాగడం కోసం, రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం తాను కొన్ని విషయాల్లో సర్దుకుపోతున్నానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అర్ధరాత్రి వేళ కూడా జనసేన జెండా పట్టుకుని చిన్నారితో నిలబడిన ఒక మహిళా కార్యకర్తను చూసినప్పుడు పార్టీ అసలైన బలం ఏంటో తనకు అర్థమైందని భావోద్వేగానికి గురయ్యారు. పోరాటమే జనసేన యొక్క మూల సిద్ధాంతమని ఆయన పునరుద్ఘాటించారు.

రాబోయే రోజుల్లో సోషల్ మీడియా వేదికగా జరిగే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు జనసేన సోషల్ మీడియా వింగ్‌ను మరింత బలోపేతం చేయాలని పార్టీ భావిస్తోంది. విమర్శకులకు దీటుగా సమాధానం ఇస్తూనే.. కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పవన్ కల్యాణ్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. రానున్న కాలంలో జనసేనాని మరింత దూకుడుగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...