ఆత్మాహుతి దాడే.. ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ
posted on Nov 11, 2025 12:22PM

ఢిల్లీ బాంబు పేలుడు ఘటన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తు సంస్థలు ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ పేలుడు ఆత్మాహుతి దాడేనని ప్రాథమింకంగా నిర్థారణకు వచ్చారు. సోమవారం(నవంబర 10) ఫరీదాబాద్ లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను భద్రతా బలగా లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో అరెస్టు నుంచి తప్పించుకున్న ఆ ముఠాకు చెందిన వ్యక్తే బాంబు పేలుడుకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సహచరులు దొరికిపోవడంతో తాను కూడా పట్టుబడతాననే ఆందోళనకు గురైన నిందితుడు.. ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి జరిపినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
ఫరీదాబాద్ లో పట్టుబడిన అనుమానిత ఉగ్రవాదుల వద్ద స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల వంటివే పేలుడు బ్లాస్ట్ లో ఉపయోగించినట్లు గుర్తించింది. డిటోనేటర్లు, అమ్మోనియం నైట్రేట్ తో పాటు ఇంధనం ఉపయోగించి పేలుడు జరిపినట్లు దర్యాప్తు సంస్థలు నిర్థారణకు వచ్చాయి.
అలాగే పేలుడుకు పాల్పడిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ మహ్మద్ గా పోలీసులు గుర్తించారు. సోమవారం పట్టుబడ్డ ఉగ్రవాద ముఠాకు, ఉమర్ మహ్మద్ కు సంబంధం ఉందని చెబుతున్నారు. పేలుడు జరిగిన సమయంలో కారులో ఉమర్తోపాటు ఇంకెవరైనా ఉన్నారా? అనే విషయం తెలుసుకోవడానికి దర్యాగంజ్, పహార్గంజ్ ప్రాంతాలలోని హోటళ్లు, లాడ్జిల ఎంట్రీలను దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేస్తున్నాయి.