ఎర్రబెల్లి, రేవంత్రెడ్డి.. కలవని మనసులు...
posted on: Sep 24, 2014 6:05PM

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్రెడ్డి మధ్య రోజు రోజుకూ దూరం పెరుగుతోంది. ఆ దూరం కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల కాకుండా, పార్టీకి సంబంధించిన కారణాలు కాకుండా కేవలం తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ మీద రేవంత్రెడ్డి దూకుడుగా చేస్తున్న విమర్శల కారణంగానే దూరం పెరుగుతోంది. తెలంగాణలో అధికారంలో వున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడుతోందని రేవంత్రెడ్డి విమర్శిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోకి సంబంధించిన స్థలాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తన బంధువు జూపల్లి రామేశ్వరరావుకు అక్రమ మార్గంలో ఇస్తున్నారన్నది రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలకు ఎర్రబెల్లి దయాకరరావు మరోరకం భాష్యం చెబుతున్నారు. రేవంత్రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఒక కులాన్నే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. రేవంత్ రెడ్డి విమర్శల మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అభ్యంతరం ఎంతవరకూ వచ్చిందంటే, ఎర్రబెల్లి కొంతమంది వ్యక్తులతో కలసి కేసీఆర్ని కలిసేంత వరకూ వచ్చింది. అది ఎర్రబెల్లి తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టబోతున్నారని, త్వరలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిపదవి పొందబోతున్నారన్న పుకార్లు రావడానికి కూడా కారణమైంది. అయితే ఎర్రబెల్లి వెంటనే ఆ పుకార్లను ఖండించారు. తాను వేరే కారణం వల్ల కేసీఆర్ని కలిశానే తప్ప పార్టీ మారడానికి కాదని వివరణ ఇచ్చారు.
ఇలా ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించడానికి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేశారు. ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేశారు. ఇద్దరి మనసులనూ కలిపే ప్రయత్నం చేశారు. అయితే అటు రేవంత్ రెడ్డిగానీ, ఇటు ఎర్రబెల్లిగానీ తమ వాదన నుంచి వెనక్కి తగ్గడానికిగానీ, విభేదాలు మరచి స్నేహపూర్వకంగా వ్యవహరించడానికి గానీ అంగీకరించనట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బాధ్యతలను స్థానిక నాయకులకే అప్పగించారు. అయితే ఇలాంటి చిన్న చిన్న వివాదాలతో తెలంగాణ నాయకులు దూరాన్ని పెంచుకుంటూ వుండటం చంద్రబాబుకు ఇబ్బందిని కలిగిస్తోంది.
ఇదిలా వుంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కుని తమ పార్టీలో చేర్చుకోవడానికి టీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టయితే వారి మీద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం, ఎమ్మెల్యే పదవికి అనర్హుడిని చేసే అవకాశం వుంటుంది. అందుకే మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు ఒకేసారి పార్టీ మారినట్టయితే వారి మీద అనర్హత వేటు పడే ప్రమాదం వుండదు. అందువల్ల సాధ్యమైనంత ఎక్కువమంది ఎమ్మెల్యేలను సమీకరించి పార్టీ మారేలా చేయాలన్నది టీఆర్ఎస్ వ్యూహమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అలా టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్క తాటి మీదకు తెప్పించే బాధ్యతను టీఆర్ఎస్ అధినేత ఎర్రబెల్లి భుజస్కందాల మీద పెట్టారని కూడా అంటున్నారు. అయితే ఎర్రబెల్లి మాత్రం తాను పార్టీ మారే అవకాశమే లేదని స్పష్టంగా చెబుతున్నారు.



.jpg)
.jpg)

.webp)



