బాలినేని వర్సెస్ దామచర్ల.. ఒంగోలులో కూటమి పార్టీల మధ్య చిచ్చు.!

posted on: Aug 10, 2026 11:06AM

ప్రకాశం జిల్లాలో కూటమి పార్టీల మధ్య చిచ్చు రేగింది. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమిలో భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మ మధ్య ఒంగోలులో ఏర్పడిన విభేదాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఇరు పార్టీల నేతలూ రెచ్చి పోతున్న తీరు జిల్లాలో పొలిటికల్ హీట్ ను అమాంతంగా పేంచేసింది.  ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  

 ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో బాలినేని పై  ఆరోపణలు గుప్పించారు. బాలినేని పేరుకే జనసేనలో ఉన్నారనీ, అయితే వైసీపీ తరఫునే, వైసీపీ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలినేని 2024 ఎన్నికల తరువాత వైసీపీకి గుడ్ బై చెప్ప జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ.. దామచర్ల.. బాలినేని వైసీపీ కోసం పని చేస్తున్నారంటూ ఆరోపించారు.  అలాగే తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే లక్ష్యంతో బాలినేని అనుచరుల ద్వారా కరపత్రాలు పంపిణీ చేయించారన్నారు. 

కూటమి ధర్మాన్ని పాటిస్తూ.. ఇంత కాలం ఓర్పుగా ఉన్నానన్న దామచర్ల.. తన ఓర్పును బాలినేని బలహీనతగా భావించి రెచ్చిపోవాలని చూస్తుండటంతో ఇక భరించలేకే బాహాటంగా బాలినేని తీరును బయటపెట్టానన్నారు.  బాలినేని రౌడీయిజాన్ని ఉపేక్షించబోనని హెచ్చరించారు.  తనపై బాలినేని వర్గీయులు చేసిన అక్రమ వసూళ్ల ఆరోపణలు  నిరూపించాలని సవాల్ చేశారు.  ఈ క్రమంలో దామచర్ల బాలినేని కుమారుడు స్థానిక యువతను గంజాయి లాంటి తీవ్ర దురలవాట్లకు గురిచేశారని సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, యువత భవిష్యత్తును నాశనం చేసేలా గతంలో కొందరు వ్యవహరించారనీ,  కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలులో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు తాము కృషి చేస్తుంటే, కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు.  

కూటమి పార్టీల అగ్రనాయకత్వం స్పష్టమైన అవగాహనతో ఐక్యంగా ముందుకు సాగుతున్నా,  ఒంగోలు నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం, జనసేన స్థానిక నాయకులు, శ్రేణుల మధ్య   సమన్వయం కుదరడం లేదన్న మాట చాలా కాలంగా వినిపిస్తూ వస్తోంది. ఇప్పుడు దామచర్ల బాలినేపిపై చేసిన ఆరోపణలు, విమర్శలు ఒంగోలులో కూటమి పార్టీల మధ్య సమన్వయ లేమికి అద్ధం పడుతున్నాయి.    

ఎమ్మెల్యే దామచర్ల చేసిన తీవ్ర ఆరోపణలపై బాలినేని శ్రీనివాసరెడ్డి లేదా ఆయన వర్గం ఎలా స్పందిస్తుందనేది ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయంలో ఉత్కంఠగా మారింది. ఇరు పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు కలసి పనిచేస్తున్న వేళ, క్షేత్రస్థాయిలో సీనియర్ నేతల మధ్య సాగుతున్న ఈ శత్రుత్వం ఎటు దారితీస్తుందోనని స్థానిక ప్రజలు, కూటమి శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అధిష్ఠానం త్వరితగతిన దిద్దుబాటు చర్యలు చేపట్టి, ఒంగోలులో ప్రశాంత రాజకీయ వాతావరణాన్ని పునరుద్ధరించాలని నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు.

Damacharla Janardhan, Balineni Srinivasa Reddy,  Ongole politics, TDP Janasena alliance, Prakasam district politics, TeluguOne

google-ad-img
    Related Sigment News
    • Loading...