శ్రీశైలంపై మొంథా ఎఫెక్ట్- పాతాళగంగ మెట్ల మార్గంలో విరిగిపడిన కొండ చరియలు
posted on Oct 29, 2025 10:23AM
.webp)
శ్రీశైలం క్షేత్రంపై మొంథా ఎఫెక్ట్ పడింది. శ్రీశైలం మండలంలో గడిచిన 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. కార్తీక మాసం సందర్భంగా దర్శనానికై క్షేత్రానికి వచ్చిన భక్తులు వసతి గదులకే పరిమితమయ్యారు. మరోవైపు శ్రీశైలం పాతాళగంగ మెట్ల మార్గంపై కొండ చరియలు విరిగిపడడంతో మూడు షాపులు ధ్వంసం అయ్యాయి.
భారీగా కొండ చర్యలు విరిగి పడుతుండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యా రు.కొండచరియలు విరిగిపడిన ఘటన రాత్రి వేళ జరగడంతో ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
వర్షపునీరు భారీగా దిగువకు ప్రవహిస్తుండటంతో ఇళ్ల ముందు ఉన్న మట్టి రోడ్లు కోతకు గురవుతున్నాయి. ఇలాగే కొనసాగితే పాతాళగంగ మెట్ల మార్గంలో ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ప్రభావం మరో రెండు రోజులు ఉన్న నైపథ్యంలో శ్రీశైలం వచ్చే భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.