మొంథా తుపాను.. పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్
posted on Oct 28, 2025 3:08PM

మొంథా తుపాను నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, ఒడిశాకు వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉన్నట్లు తెలిపింది. అదేవిధంగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో.. ఒడిశాలోని గజపతి, గంజాం జిల్లాల్లో వరదలు వచ్చే ఛాన్స్ ఉందని, ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది.
మరోవైపు మొంథా తుపాను దిశ మార్చుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అమలాపురం యానం సమీపంలో రాత్రికి దాటే అవకాశం ఉందని కోనసీమ జిల్లా ప్రత్యేక అధికారి విజయ రామరాజు వెల్లడించారు. ఈ క్రమంలో కోనసీమ జిల్లా సముద్ర తీర ప్రాంతానికి కిలోమీటర్ పరిధిలో నివసిస్తున్నా వారిని యుద్ద ప్రాతిపదికన సురక్షిత ప్రాంతలకు తరలించారు.
ఇప్పటికే కోనసీమలో భారీగా కొబ్బరి చెట్లు నెలకులుతుండగా ఇద్దరు మృతి చెందారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాను ప్రస్తుతం విశాఖపట్నానికి దక్షిణంగా 280 కి.మీ., కాకినాడకు ఆగ్నేయంగా 190 కి.మీ., మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 110 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.గడిచిన ఆరు గంటల్లో ఇది గంటకు 15 కి.మీ. వేగంతో కదులుతోందని వాతావరణశాఖ వెల్లడించింది. తుపాను ఉత్తర వాయవ్య దిశగా కదిలి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.