రూ.1500 కోట్ల విలువైన భూమి ఆక్రమణకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రయత్నం..?

posted on: May 29, 2026 6:40PM

 

హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గుండెకాయ లాంటి సైబరాబాద్ పరిధిలో మైండ్ బ్లోయింగ్ భూ కుంభకోణం వెలుగుచూసింది. ఏకంగా రూ.1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ జీఓలతో కొట్టేయాలని చూసిన ఒక భారీ మాయాజాలాన్ని సైబరాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా బట్టబయలు చేశారు.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గండిపేట ప్రభుత్వ భూములను తమ సొంతమని చూపిస్తూ నకిలీ జీఓలు సృష్టించిన భారీ భూ దందా కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో మాజీ ప్రజాప్రతినిధుల పేర్లు బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

ఇప్పటికే కేసును ఛేదించిన పోలీసులు పలువురు నిందితులను అరెస్ట్ చేయగా.. మరికొందరి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నారు. శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గండిపేట సర్వే నెంబర్ 18లోని ప్రభుత్వ భూమిని అక్రమంగా అమ్ముకునేం దుకు నిందితులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లారు.

 ప్రభుత్వం భూమిని క్రమబద్ధీకరించిందని నమ్మించేలా ఏకంగా ఐదు నకిలీ జీఓలను తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వ్యవహారంపై తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో అసలు భూ మోసం బయటపడింది.కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయికిరణ్‌లను అరెస్ట్ చేశారు. మరోవైపు మాజీ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్ సహా మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వారి కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు మరింత సంచలనంగా మారాయి. చట్టబద్ధ హక్కులు లేకపోయినా.. ఎకరా భూమిని రూ.3.5 కోట్లకు అమ్మే డీల్ కుదిరినట్లు పోలీసులు గుర్తించారు. 

ఈ అక్రమ భూ వ్యవహారంలో ఇప్పటివరకు మార్కెట్ విలువ ప్రకారం రూ.1500 కోట్లకు పైగా చేతులు మారినట్లు ఆధారాలు లభించాయి. బొల్లా బ్రహ్మనాయుడు నుంచి నిమ్మల కుటుంబానికి రెండు విడతల్లో భారీ మొత్తాలు బదిలీ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. కోర్టు ఆదేశాలతో నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన పోలీసులు ల్యాప్‌టాప్‌లు, మొబైళ్లు, బ్యాంక్ పాస్‌బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో గతంలో హైకోర్టును ఆశ్రయించిన నిమ్మల కుటుంబ పిటిషన్లను అక్టోబర్ 2025లో కోర్టు కొట్టివేసిందని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.ఫేక్ జీఓలు, నకిలీ పత్రాలతో జరుగుతున్న భూ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. భూమి కొనుగోలు చేసే ముందు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డులను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...