Latest News

గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు...సీపీ హెచ్చరిక

posted on: Mar 11, 2026 6:57PM

 

నగరాల్లో రోజురోజుకీ సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఇంటింటికీ అవసరమైన వంట గ్యాస్‌ను లక్ష్యంగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు అమాయక ప్రజలను మోసం చేసేందుకు పంజా విసరను న్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను తమకు అనుకూలంగా మార్చుకున్న సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా వేదికల ద్వారా నకిలీ ప్రకటనలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు.

 “తక్షణమే సిలిండర్ డెలివరీ”, “అదనపు సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి” వంటి ఆకర్షణీ యమైన ప్రకటనలతో ప్రజలను వలలో వేస్తు న్నారు. ముఖ్యంగా వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫేక్ వెబ్‌సైట్ లింకులను పంపిస్తూ గ్యాస్ బుకింగ్ చేసుకునేలా ప్రలోభపెడుతున్నారు. ముందుగా ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తే వెంటనే గ్యాస్ సరఫరా చేస్తామని చెప్పే సందేశాలు వస్తే అవి ఎక్కువగా సైబర్ మోసాలేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని సూచిస్తున్నారు.

గ్యాస్ సిలిండర్ బుకింగ్ లేదా ఆన్‌లైన్ చెల్లింపుల కోసం ఎప్పుడూ గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్లు లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే వినియోగించాలని అధికారులు చెబుతున్నారు. ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటి కీలక సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని హెచ్చరిస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్లలో వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తే ఆ సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...