12 మంది సైబర్ నిందితుల అరెస్టు

డిజిటల్‌ అరెస్టు పేరిట  దోచుకుంటున్న 12 మంది సైబర్‌ ముఠా సభ్యులను పులివెందుల పోలీసులు శుక్రవారం (నవంబర్ 14) అరెస్టు చేశారు.   కడప  ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ ఆ వివరాలు వెల్లడించారు.  నిందితులు వేంపల్లెకు చెందిన రిటైర్డ్‌ ఎంఈవో వీరారెడ్డికి ఏడు నెలల కిందట వీడియోకాల్‌ చేసి ఆయన పేరుతో ఉన్న సిమ్‌ద్వారా మహిళల అక్రమ రవాణా జరుగుతోందంటూ ఢిల్లీలో కేసు నమోదైందని పేర్కొంటూ.. ఇందుకు సంబంధించిన ఆధారాలంటూ  ఫేక్‌ సుప్రీంకోర్టు కాపీలు వాట్సప్‌ ద్వారా పంపించి డిజిటల్‌ అరెస్టు పేరుతో బెదిరించారు.

ఈ అరెస్టును తాత్కాలికంగా వాయిదా వేసేందుకు డబ్బు చెల్లించాలని చెప్పడంతో వారి మాటలకు భయపడిన వీరారెడ్డి తన అకౌంటులోని డబ్బు పంపించారు. అలా దాదాపు ఏడు నెలల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. చివరికి వీరారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వీరారెడ్డి వద్ద డబ్బులు వసూలు చేసేందుకు నిందితులు వేంపల్లెకు వచ్చినట్టు సమాచారం రావడంతో 12 మంది అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను శుక్రవారం పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu