ఇండియా కూటమిలో సంక్షోభం.. కాంగ్రెస్ ను వీడుతున్న మిత్రపక్షాలు

posted on: Jun 5, 2026 10:19AM

కేంద్రంలో అధికారమే లక్ష్యంగా, దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే..  2023లో ఇండియా'కూటమిగా ఏర్పడ్డాయి.  అయితే ఆ లక్ష్యం దిశగా ఈ కూటమి అడుగులు మాత్రం తడబడుతున్నాయి.   2029 లోక్‌సభ ఎన్నికలకు మూడేళ్ల ముందే ఈ కూటమి మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది.  పరస్పర విశ్వాసంతో ముందుకు సాగాల్సిన ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఎవరికి వారే యమునా తీరే చందంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ తో ఇండియా కూటమిలోని మెజారిటీ పక్షాలు విభేదిస్తున్నాయి. ఒక్కటొక్కటిగా తిరుగు బావుటా ఎగురవేస్తున్నాయి.  దేశ రాజధాని ఢిల్లీలో ఈ నె 8న జరగనున్న  17 పార్టీల ఇండియా కూటమి సమావేశాన్ని తాము పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు తాజాగా   డీఎంకే  ప్రకటించింది.  దశాబ్దాలుగా తమకు నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, తమిళనాడు రాజకీయాల్లో తమకు తీరని ద్రోహం చేసిందని డీఎంకే  పేర్కొంది. 

ఈ   సంక్షోభానికి అసలు కారణం ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే. ఈ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఈ మారుతున్న రాజకీయ సమీకరణాల నడుమ, దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న డీఎంకేను కాంగ్రెస్ పార్టీ   పక్కన పెట్టేసి.. తమిళనాడులో  ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రముఖ  నటుడు విజయ్ స్థాపించిన  తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో కాంగ్రెస్ చేతులు కలపడం డీఎంకేకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే నేత  ఇలంగోవన్ బహిరంగంగానే ఆరోపించారు. తమ మద్దతుతోనే రాజ్యసభ నామినేషన్లు దక్కించుకుని.. కూటమి ద్వారానే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, ఇప్పుడు స్వార్థం రాజకీయంతో వేరే పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దారుణమన్నారు. తాము ఇకపై ఇండియా కూటమిలో భాగం కాబోమని, లోక్‌సభలో కూడా కాంగ్రెస్ పక్కన కాకుండా తమకు విడిగా సీట్లు కేటాయించాలని డీఎంకే  ఏకంగా స్పీకర్‌ను కోరింది.  

అయితే.. కాంగ్రెస్ కు కూటమి భాగస్వామ్య పక్షాల నుంచి తిరస్కారం ఎదురు కావడం ఒక్క తమిళనా డుకే పరిమితం కాలేదు.  మరికొన్ని కీలక రాష్ట్రాల్లోనూ ఇదే రకమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల పరాజయం తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్   అంతర్గత విభేదాలు, సొంత పార్టీ నేతల తిరుగుబాట్లతో కుదేలౌతోంది.

అలాగే.. ఉత్తరాదిలో కూటమికి అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కూడా సీట్ల సర్దుబాటు ఫ్రేమ్‌వర్క్ నుంచి అధికారికంగా తప్పుకుని కూటమికి దూరం జరిగింది.  తమిళనాడులో మతతత్వ శక్తులను అడ్డుకోవడానికి, స్థిరమైన ప్రభుత్వాన్ని అందించడానికే తాము టీవీకే తో చేతులు కలిపామని కాంగ్రెస్ సమర్థించుకుంటున్నప్పటికీ..  కూటమిలోని  ప్రాంతీయ పార్టీలు మాత్రం కాంగ్రెస్ అనుసరిస్తున్న స్వార్థ రాజకీయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి.  ఇండియా కూటమి విచ్ఛిన్నం అవుతుండటం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...