Latest News
ప్లాస్మా దానం చేయండి! తబ్లిగి జమాత్ చీఫ్ పిలుపు!
posted on: Apr 22, 2020 12:31PM
ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారు ప్లాస్మాను దానం చేయాలని తబ్లిగి జమాత్ చీఫ్ మౌలానా సాద్ కందల్వీ తన అనుచరులను కోరారు. కరోనాతో పోరాటం చేసేవారికి రక్తంలోని ప్లాస్మా ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. తనతోపాటు మర్కజ్ ఇస్తమాకు హాజరైన కొంతమంది స్వీయ నిర్భందంలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
కరోనా నుంచి కోలుకున్నతబ్లిగి జమాత్ సభ్యులు తమవంతు సాయంగా ప్రస్తుతం వైరస్ బారినపడి పోరాడుతున్న వారికి.. రక్తంలోని ప్లాస్మాను దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఇంటి వద్దనే ఉండి సామాజిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేయాలని ఆయన కోరారు.
ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిగి జమాత్కు హాజరైన వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఢిల్లీ పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మౌలానా సాద్ ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు.






