కడపలో కరోనా కలకలం.!?

posted on: Jul 10, 2026 2:11PM

కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోందా?  రాష్ట్రంలో కరోనా విజృంభణ మొదలైందా? అంటే కడప జిల్లాలో కరోనా కారణంగా ఇద్దరు మరణించారన్న వార్తలు ఔననే చెబుతున్నాయి.  నాలుగేళ్ల విరామం తరువాత ఒక్కసారిగా ఏపీలో మళ్లీ కరోనా కలకలం సృష్టించింది. కడప జిల్లాలో ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. మరో నలుగురు కరోనా పాజిటివ్ గా తేలారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
రాష్ట్రంలో 2022 తర్వాత మళ్లీ కోవిడ్ మరణాలు నమోదు కావడం ఇదే మొదటిసారి కావడంతో యంత్రాంగం   అప్రమత్తమైంది. 
వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, మరణించిన వారిలో మొదటి వ్యక్తి 60 ఏళ్ల  ఎన్. సుబ్బరాయుడు.  మధుమేహం, కిడ్నీవ్యాధి, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండేవారు. మొదట తిరుపతిలోని స్విమ్స్   ఆసుపత్రిలో చేరిన ఈయనను, పరిస్థితి విషమించడంతో వేలూరులోని సిఎంసి  ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత నెల 28న  కన్నుమూశారు. ఆయన మరణానంతరం నిర్వహించిన ఆర్‌టి-పిసిఆర్  పరీక్షల్లో కోవిడ్ 19 పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీర్ఘకాలిక వ్యాధుల తీవ్రత వల్లే ఆయన పరిస్థితి వేగంగా క్షీణించిందని వైద్యులు చెబుతున్నారు.

ఇక రెండో కేసులో కడప నగరంలోని మాసాపేట ప్రాంతానికి చెందిన 46 ఏళ్ల సయ్యద్ మబాషా  కోవిడ్ బారిన పడి మరణించారు. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు, నిరంతరాయంగా వచ్చే దగ్గుతో ఆయన ఈ నెల 4న కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు ఎక్స్-రే నిర్వహించగా, రెండు ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని తీవ్రమైన న్యుమోనియాకు దారితీసినట్లు గుర్తించారు. ఆయనకు దీర్ఘకాలికంగా మద్యపానం అలవాటు ఉండటం వల్ల శ్వాసకోశ వ్యవస్థ మరింత బలహీనపడిందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుండి నాలుగు రోజుల పాటు హై-డోస్ యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోవడంతో, అనుమానం వచ్చి చెస్ట్ సిటి స్కాన్ చేయగా కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. జులై 7న ఆయన  మరణించారు.

ఈ రెండు మరణాలతో పాటు, జిల్లాలో మరో నలుగురు వ్యక్తులు ఆర్‌టి పిసిఆర్ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. వీరిలో ముగ్గురు బాధితులు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండగా, స్వల్ప లక్షణాలు ఉన్న నాల్గవ రోగిని కడపలోని ప్రత్యేక కోవిడ్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పాజిటివ్‌గా తేలిన ఈ నలుగురు రోగులు ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు.  అలాగే వీరిలో ఒకరు బూస్టర్ డోస్ కూడా పొందారు. వ్యాక్సినేషన్ పూర్తయిన వారిలో కూడా ఈ స్థాయిలో ఇన్ఫెక్షన్ కనిపించడం ఇప్పుడు వైద్యులను ఆలోచనలో పడేసింది. బాధితులు వ్యక్తపరుస్తున్న లక్షణాలను బట్టి, ఇది ఒమిక్రాన్ (  కొత్త సబ్-వేరియంట్ కావచ్చునని అధికారులు   అనుమానిస్తున్నారు.

 పరిస్థితి తీవ్రతను గమనించిన కడప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి,  ఉన్నతాధికారులు తక్షణ నివారణ చర్యలు చేపట్టారు. మరణించిన, పాజిటివ్‌గా తేలిన రోగుల నమూనాలను వైరస్  ఖచ్చితమైన వేరియంట్‌ను గుర్తించడం కోసం పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు.  

Andhra Pradesh Covid Cases, Kadapa Covid Deaths, New Corona Variant AP, Omicron Subvariant Symptoms

google-ad-img
    Related Sigment News
    • Loading...