Latest News

అజిత్ పవార్ మృతిలో కుట్ర కోణం.. బెంగళూరులో మేనల్లుడి జీరో ఎఫ్ఐఆర్

posted on: Mar 25, 2026 11:48AM

మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద మృతి కేసు కీలక మలుపు తీసుకుంది. ఇది ప్రమాదం కాదని, దాని వెనుక పెద్ద  కుట్ర ఉందనీ ఆరోపిస్తూ అజిత్ పవార్  మేనల్లుడు, ఎన్సీపీ  ఎమ్మెల్యే రోహిత్ పవార్ మంగళవారం (మార్చి 24) బెంగళూరులో  కోర్టులో జీరో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడంలో విఫలం కావడంతోనే తాను ఇక్కడ ఫిర్యాదు చేశానని ఆయన పేర్కొన్నారు.  

బారామతి సమీపంలో జనవరి   28న   జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరపాలని కోరుతూ ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని పలు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని రోహిత్ పవార్ పేర్కొన్నారు. పోలీసులు కేవలం ప్రమాద మృతి నివేదిక మాత్రమే పరిశీలిస్తున్నారనీ, దీంతో తాను  బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాననీ రోహిత్ పవార్ పేర్కొన్నారు. 

ప్రమాదానికి గురైన విమానాన్ని నడిపిన వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై రోహిత్ పవార్  తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ విమానం ప్రయాణానికి ఏమాత్రం యోగ్యం కాదని, దాని నిర్వహణ రికార్డులను తారుమారు చేశారని ఆరోపించారు. డీజీసీఏ ఆడిట్‌లో  ఈ విషయం తేలిందని గుర్తుచేశారు. చివరి నిమిషంలో సిబ్బందిని మార్చడం, అలాగే ఆ విమానాన్ని నడిపిన  పైలట్ సుమిత్ కపూర్ గతంలో మద్యం సంబంధిత ఉల్లంఘనలకు పాల్పడిన ఆరోపణలు ఉండటాన్ని రోహిత్ పవార్ తన ఫిర్యాదులో ఎత్తి చూపారు. అలాగే  వాతావరణం సరిగా లేకున్నా విమానం నడపడం వంటివి ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందన్న ఆరోపణలకు బలంచేకూరుస్తున్నాయని రోహిత్ పవర్ పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు   నిర్లక్ష్యం, హత్యానేరం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు.. తదుపరి విచారణ కోసం ఈ జీరో ఎఫ్ఐఆర్‌ను పూణెకి బదిలీ చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...