కాంగ్రెస్‌కు మరింత కష్టకాలం

posted on: Feb 15, 2016 2:56PM

నారాయణఖేడ్‌లో ఉప ఎన్నికల ఫలితం తెరాసకు అనుకూలంగా రాబోతోందన్న ఊహలు నిజమయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. ఖేడ్‌లో ఉప ఎన్నికలను తెరాస నేత హరీశ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో భారీ మెజారటీతో ఆ పార్టీ విజయం దక్కించుకోనుందని పలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఇప్పటికే ప్రకటించాయి. సాధారణంగా ఎవరన్నా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే అతని వారసులను తదుపరి ఎన్నికలలో నిలబెట్టడం, సదరు వారసులు సునాయాసంగా సీటుని గెల్చుకోవడం జరుగుతాయి. కానీ కాంగ్రెస్ సీనియర్‌ ఎమ్మెల్యే మరణంతో జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ఈ రివాజుని తోసిరాజని తెరాస తన అభ్యర్థిని గెలిపించుకోనుంది. ఇప్పటికే గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలతో కేటీఆర్‌ తాను కేసీఆర్‌కు భావి వారసుడిగా ప్రచారాన్ని పొందారు. ఇప్పడు ఖేడ్‌ ఫలితం ద్వారా తాను ఇప్పటికీ తెరాస ముఖ్యనేతనే అని హరీశ్‌ నిరూపించబోతున్నారు. మరోపక్క ఖేడ్‌లో పరాజయం దక్కితే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి పరాజయాల పరంపర కొనసాగుతున్నట్లే. సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుని దక్కించుకోలేని పార్టీ, గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలని ఇంకేం నియంత్రించగలదని విశ్లేషకుల సందేహం. ఇప్పటికే దానం నాగేందర్‌ వంటి ప్రముఖుల తెరాసలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక జానారెడ్డి, వీ.హెచ్‌ వంటి నేతలు కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నా, వారి చిత్రమైన వ్యాఖ్యలతో తెరాసకే ప్రచారాన్ని అందిస్తున్నారు. మరి ఇకమీదట తెలంగాణలో కాంగ్రెస్‌కి జవజీవాలు కల్పించే సత్తా ఉన్న నేత ఎవరో!

google-ad-img
    Related Sigment News
    • Loading...