ఆ అడుగులన్నీ టీడీపీ వైపే

posted on: Mar 26, 2014 7:08AM

 

కాంగ్రెస్ నేతల అడుగులన్నీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంవైపే పడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సాయి ప్రతాప్ టీడీపీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ పార్టీకి చెందిన కొందరు నేతలతో వీరు ఇప్పటికే సంప్రదింపుల్లో ఉన్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో వీరిద్దరూ చంద్రబాబును కలిసి మాట్లాడనున్నారని చెబుతున్నారు. వీరిలో ఒంగోలు సిటింగ్ ఎంపీ మాగుంట ఈసారి నెల్లూరు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. కానీ, అది ఇప్పటికే వేరొకరికి ఖాయం అయింది. ఆయన పేరును ఒంగోలుకు పరిశీలించడానికి టీడీపీ సుముఖంగా ఉంది. సాయిప్రతాప్ ఈసారి కూడా సుదీర్ఘకాలంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజంపేట ఎంపీ సీటును కోరుకొంటున్నారు. అక్కడ ఆయనకు కొంత పోటీ ఉన్నా టీడీపీ నాయకత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకొంటున్నారు. పార్టీలో చేరడానికి తనకు ఆసక్తి ఉందన్న సంకేతాలను ఆయన పంపిస్తున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఆయన చంద్రబాబును కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

 

అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే మధుసూధన్ గుప్తా, కృష్ణా జిల్లా తిరువూరు మాజీ ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసి మాట్లాడినట్లు సమాచారం. గుప్తా ఇప్పుడు కూడా గుంతకల్లు సీటును ఆశిస్తుండగా పద్మజ్యోతి ఎక్కడైనా ఎంపీ సీటును కోరుకొంటున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తున్న మహారాజుల కుటుంబానికి చెందిన సోదరులు నరేశ్, దినేశ్ మంగళవారం చంద్రబాబును కలిశారు. వీరిలో నరేశ్ మాజీ మంత్రి మాణిక్‌రావు కుమారుడు. ఆయనకు ఈసారి తాండూరు టికెట్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది.

 

హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ స్వప్నారెడ్డి కూడా మంగళవారం చంద్రబాబును కలిశారు. దివంగత టీడీపీ నేత ఎలిమినేటి మాధవరెడ్డి సోదరుని కుటుంబానికి చెందిన స్వప్నారెడ్డి.. ఈసారి నల్లగొండ జిల్లా భువనగిరి లేదా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...