ఆర్ఎస్ఎస్ అడుగు జాడల్లో హస్తం పార్టీ?

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అంటే  కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి ఉన్న అభిప్రాయం ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒకటి రెండు సార్లు కాదు..   వందల సార్లు రాహుల్ గాంధీ ఐ హేట్ ఆర్ఎస్ఎస్ అని చాలా స్పష్టంగా చెప్పారు.  ఆఫ్కోర్స్, ఆయన అవే పదాలను, అదే క్రమంలో అని ఉండక పోవచ్చును, కానీ  ఎప్పుడు  ఎక్కడ, ఎలాంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ ప్రస్తావన వచ్చినా..  రాహుల్ గాంధీ తన వ్యతిరేకతను, ద్వేషాన్నీ ఎప్పుడూ  దాచుకోలేదు. నిజానికి  రాహుల్ గాంధీ బీజీపీ, మోదీలను ఎక్కువ వ్యతిరేకిస్తారా? ఆర్ఎస్ఎస్ ను ఎక్కువ వ్యతిరేకిస్తారా అంటే అనుమానం లేకుండా  ఆర్ఎస్ఎస్  అనే సమాధానమే వస్తుంది. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే క్రమంలోనే ఆయన బీజేపీ,ఆర్ఎస్ఎస్ లతో పాటుగా దేశం పై కూడా  యుద్ధం ప్రకటించారు. అందుకే, ఆర్ఎస్ఎస్ ప్రస్తావన ఎక్కడ వచ్చినా.. ఎప్పుడు వచ్చినా  రాహుల్ గాంధీ అగ్గి మీద గుగ్గిలం అవడం చూస్తున్నాము. 

కాగా  కొద్ది రోజుల కిందట, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సందీప్ దీక్షిత్ తో జరిపిన  సంభాషణలోనూ రాహుల్  గాంధీ అదే చెప్పారు. అంతే కాదు.. ఆర్ఎస్ఎస్ పట్ల తమకున్న వ్యతిరేకత తమ జీన్స్ లోనే ఉందని క్లారిటీ ఇచ్చారు. అవును.. మీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ కలలో కనిపిస్తే..  మీరు ఆయన్ని ఏమి అడుగుతారు? అని సందీప్ దీక్షిత్  అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ, తాను అడిగే ప్రశ్నతో పాటుగా నెహ్రూ చెప్పే సమాధానం కూడా చెప్పారు. 
 మా ముత్తాత నెహ్రూ కనిపిస్తే.. నేను Tell me one thing that I never ever do  అంటే నేను జీవితంలో ఎప్పుడూ, ఎప్పటికీ ఏది చేయకూడదో చెప్పమని అడుగుతానని  సమాధానం ఇచ్చారు. అంతే కాదు, ఆ వెంటనే,తన ప్రశ్నకు  నెహ్రూ .. ఇచ్చిన సమాధానం కూడా చెప్పనా?  అంటూ  Never compromise with RSS   ఆర్ఎస్ఎస్ తో ఎప్పుడు రాజీ పడద్దు  అని నెహ్రూ చెప్పారని రాహుల్ చెప్పారు. 

ఈ సభాషణను గమనిస్తే, రాహుల్ గాంధీకి ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేకత వెనుక జన్మజన్మల వైరం ఏదో ఉందనిపిస్తుంది. అలాగే.. ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేకత, ద్వేషం ఏస్థాయిలో వుందో,  అ ద్వేషం మూలాలు ఎక్కడ ఉన్నాయో కూడా స్పష్టంగా అర్థం అవుతుందని అంటున్నారు. 

 అయితే.. రాహుల్ గాంధీకి ఆర్ఎస్ఎస్ పట్ల ఇంత వ్యతిరేకత, ద్వేషం ఉన్నదన్న సంగతి అందరికీ తెలిసిందే.  అ యినా.. చిత్రంగా తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజాన్ మాత్రం..  కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని  సూచించారు. అవును..  చేవెళ్ల, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో నిర్వహించిన  సమీక్షా సమావేశంలో ఆమె, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఆదర్శంగా తీసుకుని,వారి పద్దతిలో పనిచేయాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

 అలాగే,ఆర్ఎస్ఎస్ ఎలా పనిచేస్తుందో కూడా ఆమె వివరించారు. ఆర్ఎస్ఎస్  సభ్యులు మనిషి మనిషినీ కలుస్తారు.  కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కూడా అదే తరహాలో మనిషి మనిషినీ కలిసి ప్రభుత్వ పథకాలను, వాటి ద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాలను వివరించాలని సూచించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేవలం మీడియానో, సోషల్‌ మీడియానో నమ్ముకుంటే సరిపోదని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ముఖాముఖి  మాట్లాడాలని,  అప్పుడే ప్రజలు నాయకులకు, పార్టీకి, ప్రభుత్వానికి దగ్గరవుతారని చెప్పారు. 

అయితే..  ఈ సూచనను, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఎలా తీసుకుంటారు? ఎంత వరకు అమలు చేస్తారు? అనేది పక్కన పెడితే.. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడవాలనే మీనాక్షి నటరాజన్ సూచనను రాహుల్ గాంధీ ఎలా తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారిందని అంటున్నారు. ఓవంక రాహుల్ గాంధీ, కాంగ్రెస్ లో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోవర్టులను గుర్తించి  ఏరివేయాలని అంటుంటే, మీనాక్షి నటరాజన్  ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడవాలని కార్యకర్తలు, నాయకులకు చేసిన సూచనను ఎలా తీసుకోవాలని, కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. 
అయితే..  పార్టీ ముఖ్యనాయకులు మాత్రం  ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలేందుకు రాహుల్ గాంధీ ఒక్క నాటికీ అంగీకరించరని అంటున్నారు. అలాగే.. మీనాక్షి నటరాజన్  అనాలోచితంగా ఈ సూచన చేసి ఉండవచ్చునని అంటున్నారు. అన్నిటిని మించి,ఆర్ఎస్ఎస్  కార్యకర్తల  కమిట్మెంట్ తో పనిచేయడం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు మాత్రమే సాధ్యమని, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే, నటరాజన్ సూచనలను, అంత సీరియస్ గా తీసుకోవలసిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకులే అంటున్నారు.