కేటీఆర్ కు కాంగ్రెస్ నేత బర్త్ డే గిఫ్ట్ ఏంటో తెలుసా?

posted on: Jul 24, 2026 4:43PM

 

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమే. అయితే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఓ కాంగ్రెస్ నేత బర్త్ డే గిఫ్ట్ గా ఓ వినూత్న గిఫ్ట్ పంపి సంచలనం సృష్టించారు. కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 (శుక్రవారం) ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు.

అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు. ఈ విషయంపై గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన మెట్టు సాయి కుమార్..  ఇది కేటీఆర్‌కు మా బర్త్‌డే గిఫ్ట్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సన్నబియ్యం విలువ తెలుసుకోవాలనే కేటీఆర్ కు  ఈ కానుక పంపినట్లు చెప్పారు. 

ఈ పాతిక కిలోలతో సరిపెట్టేయడం లేదనీ, అవసరమైతే.. ప్రతి నెలా ఈ రేషన్ ను కేటీఆర్ కు పంపేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు.  దేశంలో ప్రజలకు సన్నబి య్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఇంటికీ నాణ్యమైన బియ్యం చేరుతోందని పేర్కొన్నారు.

 ఒకప్పుడు సన్నబియ్యంతో వంట చేస్తే అది పండగ రోజు అనుకునేవారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఇంట్లో ప్రతిరోజూ పండగేనని సాయికుమార్ చెప్పారు.  మొత్తం మీద సాయికుమార్ కేటీఆర్ కు పంపిన ఈ బర్త్ డే గిఫ్ట్ రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి.  

25kgs, sannabiyyam, rapido, telanganabhawan, Mettu Saikumar

google-ad-img
    Related Sigment News
    • Loading...