మణిపూర్‌ కాంగ్రెస్‌లో ముదురుతున్న సంక్షభం

posted on: Apr 1, 2016 4:48PM

 

మొదట అరుణాచల్‌ ప్రదేశ్‌ ‘చేయి’జారిపోయింది. ఆ తంతు అలా ముగిసిందో లేదో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంలో ముసలం మొదలైంది. తాజాగా కాంగ్రెస్‌ ఆధీనంలో ఉన్న మరో రాష్ట్రంలో కూడా సమస్య మొదలైంది. మణిపూర్‌ ప్రభుత్వంలో సాగుతున్న సంక్షోభం ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. అక్కడ 60 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 47 సభ్యుల భారీ మెజారటీ ఉంది. అయితే ఇందులో ఏకంగా 25 మంది కాంగ్రెస్‌ సభ్యులు ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ముఖ్యమంత్రి తప్ప క్యాబినెట్‌లో ఉన్న మంత్రులందరినీ కూడా తప్పించి కొత్త మంత్రివర్గాన్ని ప్రకటించమన్నది అసమ్మతివాదుల కోరిక.

 

అయితే తమలో ఒక్క మంత్రిని తొలగించినా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ప్రస్తుతం ఉన్న 11 మంది మంత్రులూ తేల్చిపారేశారు. దీంతో ఇటు నుయ్యి, అటు గొయ్యిగా మారిపోయింది అక్కడి ముఖ్యమంత్రి ఒక్రాం సింగ్ పరిస్థితి. మంత్రులందరినీ మూకుమ్మడిగా తొలగిస్తే, ప్రజల్లో విశ్వాసం కోల్పోతామన్నది ప్రస్తుత మంత్రుల వాదన. తిరుగుబాటు నేతలు మాత్రం, రెండున్నర ఏళ్ల తరువాత మంత్రివర్గాన్ని మారుస్తామన్న హామీని, ముఖ్యమంత్రి నెరవేచ్చాలని పట్టుబడుతున్నారు. ముచ్చటగా ఈ మూడో రాష్ట్రానికి చెందిన వివాదం ఎక్కడికి చేరుతుందో చూడాలి!

google-ad-img
    Related Sigment News
    • Loading...