కాంగ్రెస్ మార్క్ సమీక్ష
posted on: Jul 2, 2014 8:17PM
(3).jpg)
కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పుడు సమావేశమయినా పార్టీ గురించే ఆలోచిస్తారు. పార్టీ గురించే మాట్లాడుకొంటారు. ఎన్నికలలో ఓడిపోయినా ప్రతీసారి ‘పార్టీ ఓటమికి నువ్వే కారణమంటే...కాదు..నువ్వేనని’ కీచులాడుకొంటారు. ఆ తరువాత మనమెవరమూ కాదు ప్రతిపక్షాలే కారణమని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించుకొంటారు. పనిలోపనిగా పార్టీ ప్రక్షాళన గురించి కూడా మాట్లాడుకొంటారు. మంగళవారం డిల్లీలో జరిగిన పార్టీ సమావేశానికి వెళ్ళిన టీ-కాంగ్రెస్ నేతలు కూడా ఇవే విషయాలు మాట్లాడుకొన్నామని మీడియాకు తెలిపారు.
తెలంగాణా ఇచ్చినా పార్టీని గెలిపించలేకపోయినందుకు సిగ్గుతో తలదించుకొంటున్నామని వీ. హనుమంత రావు స్వయంగా తెలిపారు. తెలంగాణా ఇచ్చినపుడే పార్టీని గెలిపించలేని వారు, ఐదేళ్ళలో తెరాస ప్రభుత్వం అభివృద్ధి సాధించి చూపిస్తే, అప్పుడు కాంగ్రెస్ పార్టీని ఈ వయసుడిగిన నేతలు ఏవిధంగా గెలిపిస్తారో, సోనియా గాంధీ కనుగొన్నారో లేదో తెలియదు. కానీ షరా మామూలుగానే ఆంధ్రా, తెలంగాణాలలో ప్రతిపక్ష పార్టీలు భూటకపు హామీలు గుప్పించడం వలనే ప్రజలు కాంగ్రెస్ ను కాదని వారికి ఓటేయడంతో ఓడిపోయామని సర్ది చెప్పుకొన్నారు. అంతేగాక టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాల శల్యసారధ్యం కారణంగా కూడా పార్టీ ఓడిపోయిందని అందరూ అభిప్రాయపడిపోయారు. అందువల్ల పొన్నాలను ఇప్పటికయినా ఆ పదవిలో నుండి తప్పించి తమవంటి సీనియర్లకు అవకాశం ఇస్తే, ‘నైవేద్యం పెట్టు నా మహిమ చూపిస్తా!’నన్నట్లు వచ్చే ఎన్నికలలో పార్టీని తప్పకుండా గెలిపించుకొంటామని అందరూ సోనియా గాంధీకి హామీ ఇచ్చినట్లు సమాచారం. శాసనమండలిలో 15మంది సభ్యులున్నప్పటికీ, తమ అభ్యర్ధిని మండలి చైర్మన్ గా గెలిపించుకోలేనివారు, పార్టీ సభ్యులు గోడదూకి వెళ్లిపోతుంటే ఆపలేనివారు, ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికల వరకు పార్టీని బ్రతికించి ఉంచగలరా? అని సోనియాగాంధీ ప్రశ్నించారో లేదో కూడా తెలియదు. కానీ పార్టీ ఓటమిపై సమీక్ష జరిగింది.



.jpg)
.jpg)

.webp)



