ముగ్గురు ముఖ్యమంత్రులకి మూడింది!

posted on: Jun 20, 2014 1:18PM

 

కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దుంపనాశనం అయిపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ చుట్టూచేరి భజన చేసే పాతతరం కాంగ్రెస్ నాయకులే అని దేశంలో నిక్కర్లేసుకున్న పిల్లలని అడిగినా చెబుతారు. అయితే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యతని తమ భుజాల మీద వేసుకోవడానికి సిద్ధంగా లేరు. నేరమంతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద వేసి చేతులు దులుపుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మూడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కుర్చీమీద నుంచి దించేసి సోనియా భజన చేసే ముసలి నాయకులను ఆ కుర్చీల మీద కూర్చోపెట్టడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. మొదట మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్‌ మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఆయన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలోంచి తప్పించి సుశీల్ కుమార్‌ షిండేని మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా పంపించాలని అనుకుంటుంది. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికలలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మటాషైపోయింది. త్వరలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ముఖ్యమంత్రిని మారిస్తే సరిపోతుందనుకునే అజ్ఞానంతో కాంగ్రెస్ పార్టీ ఈ దిశగా ముందుకు వెళ్తోంది. అలాగే హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ పదవులకు కూడా కాంగ్రెస్ ఎసరు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. వీరిని ఇంటికి పంపడానికి కూడా గత ఎన్నికలలో ఓటమినే కాంగ్రెస్ పార్టీ సాకుగా చూపుతోంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ బాగుపడాలంటే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఇంటికి సాగనంపడం కాదు.. సోనియా, రాహుల్ రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చోవాలన్న విషయం ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో!

google-ad-img
    Related Sigment News
    • Loading...