Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తమిళనాడు రైతులకు సీఎం విజయ్ తీపి కబురు
posted on: Jun 16, 2026 3:03PM

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రైతులకు భారీ ఊరటనిచ్చే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని రైతులపై పెరుగుతున్న అప్పుల భారాన్ని తగ్గించేందుకు సహకార బ్యాంకులు, సహకార సంఘాల ద్వారా తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రుణమాఫీ పథకానికి ఆమోదం తెలిపింది.ప్రభుత్వ నిర్ణయం ప్రకారం... అర్హులైన రైతులకు రూ.75,000 వరకు ఉన్న వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయనున్నారు.
దీంతో చిన్న, సన్నకారు రైతులకు తక్షణ ఆర్థిక ఉపశమనం లభించనుంది. రైతులు తిరిగి వ్యవసాయ కార్యకలాపాలపై దృష్టి సారించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఈ రుణమాఫీ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14.43 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. రుణాల భారం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న లక్షలాది కుటుంబాలకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది. ముఖ్యంగా సహకార రంగ సంస్థల నుంచి రుణాలు తీసుకుని పంటల సాగు చేసిన రైతులకు ఈ పథకం ప్రయోజనం చేకూరనుంది.
అయితే, ఈ రుణమాఫీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై రూ.5,932 కోట్లకు పైగా ఆర్థిక భారం పడనుంది. అయినప్పటికీ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, రైతుల ఆర్థిక స్థితిని మెరుగు పరచడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంటున్నారు.రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం విజయ్ స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిదని, రైతులు ఆర్థికంగా బలపడితేనే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తీసుకున్న రుణమాఫీ నిర్ణయం తమిళనాడు రాజకీయ, వ్యవసాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.






