ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసిన సీఎం విజయ్

posted on: May 10, 2026 11:29AM

 

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌పై ఫైలుపై తన మొట్టమొదటి సంతకాన్ని చేశారు. ఈ నిర్ణయం పట్ల సామాన్య ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా, సామాజిక భద్రతకు ప్రాధాన్యతనిస్తూ మరిన్ని కీలక నిర్ణయాలపై ఆయన సంతకాలు చేశారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థను బలోపేతం చేసే ఫైలుపై రెండో సంతకం చేయగా, యువతను పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని అంతం చేసేందుకు 'ఈగల్' తరహా నిఘా వ్యవస్థ ఏర్పాటుకు మూడో సంతకంతో పచ్చజెండా ఊపారు. సంక్షేమం, రక్షణే తన ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని విజయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

రాష్ట్రంలో మహిళల భద్రతను అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, వేధింపులు, దాడులు, నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమిళనాడులో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు విజయ్ ప్రకటించారు. యువతను రక్షించేందుకు డ్రగ్స్ నెట్‌వర్క్‌పై సమగ్ర దాడి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పారదర్శకత కోసం త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తానని సీఎం తెలిపారు. ప్రజలకు నిజమైన ఆర్థిక స్థితిని తెలియజేయడం తమ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ మాట్లాడుతూ“శత్రువులైనా… మిత్రులైనా… 8 కోట్ల ప్రజలంతా నా ప్రజలే” అని వ్యాఖ్యానించారు. 

కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ “My Dear Virtual Warriors… New Era Starts Now” అంటూ కొత్త రాజకీయ యుగానికి శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయాలతో విజయ్ ప్రభుత్వం ప్రజల అంచనాలను ఎంతవరకు నెరవేర్చుతుందో అన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. టీవీకే కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే విజయ్ తన మంత్రివర్గ సహచరులతో భేటీ అయి, పాలనను పరుగులు పెట్టించే దిశగా పూర్తిస్థాయి సమీక్షలు నిర్వహించనున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అవినీతి రహిత పాలన అందిస్తారన్న నమ్మకంతో తమిళ ప్రజలు విజయ్ నాయకత్వం వైపు ఆశగా చూస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...