పని తీరు బాలేని మంత్రులకు ఉద్వాసన.. పీపుల్స్ చాయిస్ బడ్జెట్.. పాలనలో తమిళనాడు సీఎం ముద్ర.!

posted on: Aug 3, 2026 4:30PM

తమిళనాడు సీఎం  విజయ్  తనదైన ప్రత్యేక శైలిలో ప్రజాదరణ చూరగొంటూ సంచలన నిర్ణయాలతో  పాలనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. మాటల సీఎంగా కాకుండా చేతల సీఎంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.   హామీలను నెరవేర్చడంలోనూ, ఆ దిశగా పాలనా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంలోనూ విజయ్ వేగం  తమిళనాటే కాకుండా దేశ వ్యాప్తంగా  హాట్ టాపిక్‌గా మారింది.  

ఇటీవలే  తన మంత్రివర్గం పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించిన విజయ్.. పాలనలో పారదర్శకత, బాధ్యత లేని ప్రవర్తనను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా..  పనితీరులో నాట్ ఆప్ టు ద మార్క్ అని తేలిన నలుగురు మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికేందుకు నిర్ణయించారు.  ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. విశ్వనాథన్, రవాణా శాఖ మంత్రి ఎ. విజయ్ తమిళన్ పార్తిబన్‌లపై వచ్చిన వరుస ఫిర్యాదులు, హెచ్చరించినా తీరు మారకపోవడంతో వారిపైనా, అలాగే..  విమర్శలు, వివాదాల కారణంగా సామాజిక సంక్షేమ శాఖ మంత్రి కె. జగదీశ్వరి, అదే కారణాలతో   హెచ్‌ఆర్‌ఎమ్ మంత్రి డి. శరత్‌కుమార్ లపై వేటు వేయాలని విజయ్ భావిస్తున్నట్లు టీవీకే వర్గాలు చెబుతున్నాయి.  

కేవలం పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం  వెట్రి తమిళగం విజన్  పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద  50 వేల  కోట్ల  రాష్ట్ర పెట్టుబడి నిధి  ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా,  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు. సాంకేతిక రంగానికి కేటాలిస్ట్‌గా నిలిచేలా  అరివంగం  పేరుతో అత్యాధునిక  ఏఐ సిటీ  నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలను తమిళనాడుకు ఆకర్షించడంతో పాటు భారీ స్థాయిలో ఉద్యోగాల సృష్టే లక్ష్యంగా ఈఏఐ సిటీని నగరాన్ని తీర్చిదిద్దనున్నారు.

ప్రజా సంక్షేమం, బ్యూరోక్రసీ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తేవడానికి విజయ్ సర్కార్  నో అప్లికేషన్    విధానాన్ని తీసుకువస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వ పథకానికైనా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ కొత్త విధానంలో ఆధార్ అనుసంధానిత ఆటో ఐడెంటిఫికేషన్ ద్వారా అర్హులైన లబ్ధిదారులను   గుర్తించి, వారు ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే నేరుగా పథకాల ప్రయోజనాలను అందిస్తారు. దీనికి తోడు ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు  పీపుల్స్ ఛాయిస్ బడ్జెట్ భావనను అమలులోకి తేవాలని నిర్ణయించారు. దీని ప్రకారం జిల్లా నిధులలో ఏకంగా 10 శాతం నిధుల వినియోగాన్ని స్థానిక ప్రజల నిర్ణయానికే వదిలేస్తారు. తమ ప్రాంతానికి ఏ రకమైన అభివృద్ధి పనులు అవసరమో ప్రజలే నేరుగా నిర్ణయించుకునే హక్కును కల్పించడం ద్వారా సీఎం విజయ్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.   
 
CM Vijay, Tamil Nadu Politics, AI City Arivangam, Vetri Thamizhagam Vision, Vijay Cabinet ministers, oust,  TN State Investment Fund                                                                                      

google-ad-img
    Related Sigment News
    • Loading...