Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ అభివృద్ధికి అడ్డంకి కిషన్ రెడ్డే : సీఎం రేవంత్
posted on: Jun 12, 2026 8:17PM
.webp)
ఢిల్లీ పర్యటనలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి కేంద్రం ఎంత మేర నిధులు ఇచ్చిందో కిషన్ రెడ్డి ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు నిధులు ఇవ్వొద్దని స్వయంగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులకు సూచించారని, ఆ విషయాన్ని కొందరు కేంద్ర మంత్రులే తనకు చెప్పారని పేర్కొన్నారు.
ఐఆర్ఎఫ్సీకి నిధులు ఎందుకు ఇవ్వడం లేదని, రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టుకు కేంద్రం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్ మంత్రి అయిన కిషన్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసం ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. మహారాష్ట్రతో పెండింగ్లో ఉన్న భూవివాదాలపై కూడా కేంద్ర మంత్రి స్పందించకపోవడం బాధాకరమన్నారు.
గతంలో ఏడు మండలాలు, సగం అసెంబ్లీ నియోజకవర్గాన్ని, లక్షల ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ కోసం మహారాష్ట్ర నుంచి కేవలం 1500 ఎకరాల భూమి తీసుకురావడంలో ఎందుకు విఫలమవుతోందని ప్రశ్నించారు. మహారాష్ట్రలో బీజేపీ ముఖ్యమంత్రి, కేంద్రంలో బీజేపీ ప్రధాని ఉన్నప్పటికీ ఈ సమస్య పరిష్కారానికి కిషన్ రెడ్డి ప్రయత్నించడం లేదని విమర్శించారు.
1500 ఎకరాల భూమి విషయంలో కిషన్ రెడ్డి ప్రధాని వద్ద గట్టిగా నిలబడాలని, అవసరమైతే "భూమి ఇవ్వకపోతే కేంద్ర కేబినెట్ సమావేశాలకు హాజరుకాను" అని చెప్పాలని సూచించారు. ఈ అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో చర్చించానని, జూలైలో ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారంపై సమావేశం నిర్వహించాలని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు.
తెలంగాణలో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కటిగా పనిచేయడం లేదన్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నియోజకవర్గంలోనే మెట్రో విస్తరణ జరగబోతున్నా, రాజకీయ కారణాలతో కొందరు నేతలు అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. "రేవంత్ రెడ్డికి పేరు వస్తుందనే భయంతో కిషన్ రెడ్డి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు. కేటీఆర్ ఏం చెబితే ఢిల్లీలో కిషన్ రెడ్డి అదే చేస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై తనతో ఒక్కసారైనా చర్చించలేదని, కేంద్ర మంత్రులను కలిసేటప్పుడు తనను వెంట తీసుకెళ్లలేదని కిషన్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రులను కలిసేందుకు తనతో రావాలని సవాల్ విసిరారు.
మీనాక్షి నటరాజన్ వ్యవహారంపై స్పందన
కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ వ్యవహారంపై స్పందించిన సీఎం, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించే అధికారం ఆమెకు లేదన్నారు. కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ నమోదైతే ప్రొసీజర్ ప్రకారం సమన్లు జారీ అవుతాయని తెలిపారు. నామినేషన్ పత్రాల్లో క్రిమినల్ కేసుల వివరాలు పొందుపరచాలని మాత్రమే నిబంధన ఉందని, నోటీసుల వివరాలు ఇవ్వాలన్న నిబంధన లేదని స్పష్టం చేశారు.
ఎన్నికల కమిషన్ అధికారులు, ముఖ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్, బీజేపీ కార్యకర్తలా వ్యవహరించి ఆ పార్టీకి లాభం చేకూర్చారని ఆరోపించారు. సంఖ్యాబలం లేకపోయినా రాజకీయ లాభం కోసం బీజేపీ మూడో నామినేషన్ వేసిందని, అది సాధ్యం కాకపోవడంతో "సీట్ చోరీ"కి పాల్పడిందని విమర్శించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సూచనల మేరకు ఎన్నికల పిటిషన్ దాఖలు చేస్తామని ప్రకటించారు.
బీజేపీకి ప్రజాస్వామ్యం పట్ల, మహిళల పట్ల గౌరవం లేదని ఆరోపించిన సీఎం, నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన ఇలాంటి కేసులు ఇప్పటివరకు రాలేదని, అన్ని కోణాల్లో న్యాయపరంగా పరిశీలిస్తామని చెప్పారు.
పవన్ కళ్యాణ్ సభ, హిట్లర్ వివాదంపై స్పందన
పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరించడం పూర్తిగా లా అండ్ ఆర్డర్ సమస్యల కారణంగానే జరిగిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్కు పూర్తి స్వేచ్ఛ ఉందని, తెలంగాణలో ఎక్కడైనా తిరగొచ్చని, ఎక్కడైనా పోటీ చేయొచ్చని పేర్కొన్నారు.
హిట్లర్ వివాదంపై స్పందిస్తూ, "హైడ్రా అనే పదం హిట్లర్ కాలంలో ఉండేదని మాత్రమే చెప్పాను. హిట్లర్ నాకు ఆదర్శం అని ఎక్కడా చెప్పలేదు. నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది" అని స్పష్టం చేశారు.
క్యాబినెట్ విస్తరణపై క్లారిటీ
క్యాబినెట్ విస్తరణపై వస్తున్న వార్తలను మీడియా ఊహాగానాలుగా కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీలోని 66 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు అర్హులేనని, అయితే రాజ్యాంగ పరిమితుల కారణంగా 17 మందికే అవకాశం ఉంటుందని తెలిపారు.






