Latest News
క్రీడాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
posted on: Mar 9, 2026 3:12PM

క్రీడాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు, క్రీడా మైదానాల ఏర్పాటుపై చర్చించారు. అలాగే గచ్చిబౌలి స్టేడియం పునరుద్ధరణపై అధికారులకు సూచనలు చేశారు. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించేందుకు నగరంలోని పలు స్టేడియంలను ఆధునీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో అన్ని రకాల క్రీడలకు అవసరమైన మైదానాలు, అంతర్జాతీయ ప్రమాణాల సౌకర్యాలు కల్పించే అంశంపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు రాష్ట్రంలో అత్యాధునిక సదుపాయాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని సీఎం సూచించారు.
గచ్చిబౌలి ఔట్డోర్ స్టేడియాన్ని పునరుద్ధరించడంతో పాటు స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, వివిధ క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్నగర్ స్టేడియంలను భవిష్యత్ అవసరాలు, శిక్షణా కార్యక్రమాలు, పోటీలకు అనుగుణంగా ఆధునీకరించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేమ్ నరేందర్ రెడ్డి, SAT చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శ్రీనివాస రాజు, శేషాద్రి, SAT ఎండీ సోనీ బాలదేవి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జి. కిషోర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






