Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతాం : సీఎం రేవంత్
posted on: Jul 10, 2026 7:38PM
.webp)
ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సాధారణ ఎన్నికలు 2028 డిసెంబర్లో కాకుండా, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2029 మే లేదా జూన్లో జరిగే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. అప్పటికి తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు, పార్లమెంట్ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయని అన్నారు. కొత్తగా ఏర్పడే 182 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ కనీసం 117 స్థానాలు గెలిచి వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 65 స్థానాలు గెలుస్తుందని ముందుగానే చెప్పామని, అదే నిజమైందని గుర్తు చేశారు.
ఖమ్మం జిల్లా ప్రజల మద్దతుతోనే 2023 జూలైలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన సందర్భంగా బీఆర్ఎస్కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అదే జూలై నెలలో నిర్వహించిన చింతకాని రైతు ఆశీర్వాద సభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.
సభలో బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ను మళ్లీ తెలంగాణలో బలపడనివ్వబోమని, కురుక్షేత్రం లాంటి రాజకీయ పోరులో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అన్నారు. కేసీఆర్ కుటుంబంలోనే విభేదాలు ఉన్నాయని, హరీశ్ రావు బీజేపీలోకి వెళ్లరని కేసీఆర్పై ఒట్టు వేసి చెప్పాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోందని కూడా వ్యాఖ్యానించారు.
రైతుల సంక్షేమంపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. రైతు ఆశీర్వాద సభలో భాగంగా 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,009 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రైతు భరోసా మొత్తాన్ని రూ.12 వేలుకు పెంచామని, రైతు రుణమాఫీ అమలు చేసి లక్షలాది మంది రైతులను రుణ విముక్తులను చేశామని తెలిపారు.
కన్నెపల్లి పంప్హౌస్లను ప్రారంభించాలని బీఆర్ఎస్ చేస్తున్న డిమాండ్పై స్పందించిన రేవంత్ రెడ్డి... మేడిగడ్డలో మళ్లీ నీటిని నిల్వ చేస్తే భద్రాచలం శ్రీరామాలయం సహా ఖమ్మం జిల్లాలోని 44 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వలేమని స్పష్టం చేశారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రస్తావించిన సీఎం... షాదీ ముబారక్, రైతు బంధు వంటి పథకాలను కొనసాగిస్తున్నామని, ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 26 స్థానాల్లో కనీసం 20 స్థానాలు కాంగ్రెస్కు గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మధిరకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. చివరగా "ఔర్ ఏక్ బార్... కాంగ్రెస్ సర్కార్" అంటూ ప్రసంగాన్ని ముగించారు.






