నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు...సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

posted on: Jun 6, 2026 3:40PM

 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక రాజకీయ, పరిపాలనా అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు" అంటూ తన పరిపాలనా శైలిని వివరించారు. రాజకీయ చతురత కంటే కామన్ సెన్స్‌తోనే ఎక్కువ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రోజుకు 16 నుంచి 18 గంటల పాటు ప్రజల కోసమే పనిచేస్తానని, తనకు ప్రజాసేవే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

పాలనపై క్షేత్రస్థాయి సమాచారం కోసం తాను అనుసరిస్తున్న విధానాన్ని వెల్లడించిన సీఎం, రాత్రి వేళల్లో కొందరు జర్నలిస్టులతో మాట్లాడి ప్రభుత్వ పనితీరుపై నిజమైన ఫీడ్‌ బ్యాక్ తెలుసుకుంటానన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే వార్తలను కూడా నిశితంగా పరిశీలిస్తానని, వాటి ద్వారా లోపాలు గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతిపక్షానికి అనుకూలంగా భావించే మీడియా ప్రతినిధులను కూడా ప్రెస్ మీట్‌లకు ఆహ్వానిస్తానని తెలిపారు.

హైడ్రా (HYDRA) కూల్చివేతల అంశంపై స్పందిస్తూ, పేదలు అవసరాల కోసం ఆక్రమణలకు పాల్పడితే మానవీయ కోణంలో చూడవచ్చని, కానీ ధనికులు చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే సహించబోమన్నారు. హైడ్రా అమలులోకి వచ్చిన తర్వాత చెరువుల ఆక్రమణలకు ఎవరూ సాహసించలేని పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి వ్యవస్థలు ప్రధానంగా మెట్రో నగరాల పరిరక్షణకు అవసరమని అభిప్రాయపడ్డారు.

విద్యా రంగంలో సంస్కరణలపై మాట్లాడుతూ, కులరహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వేర్వేరు హాస్టళ్ల బదులు అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకునేలా "యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్" ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో లక్ష మంది విద్యార్థులు అదనంగా చేరారని వెల్లడించారు. విద్యార్థులకు ఉచిత అల్పాహారం, రవాణా సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు.

సామాజిక న్యాయం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును దేశంలోనే మొదటగా తెలంగాణలో అమలు చేశామని సీఎం పేర్కొన్నారు. ఓబీసీ జనాభా లెక్కలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించి సామాజిక గణన పూర్తి చేసిందన్నారు. పేదరికాన్ని కేవలం ఆర్థిక కోణంలో కాకుండా విద్యా, సామాజిక పరిస్థితుల ఆధారంగా కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

తన వ్యక్తిగత నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా తెలంగాణ సంప్రదాయ దుస్తులను గౌరవంగా ధరిస్తానన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి రాజకీయాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని, తెలంగాణ అంశంలో ఆయన వైఖరి భిన్నంగా ఉండేదని వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.

యువతను క్రీడల వైపు మళ్లించడమే తన లక్ష్యమని పేర్కొన్న సీఎం, తాను కూడా ఫుట్‌బాల్ ఆడతానని చెప్పారు. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని తెలంగాణకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

మహిళా రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతూ, మహిళల సాధికారతకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సోనియా గాంధీ విశేష కృషి చేశారని గుర్తు చేశారు. నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్లకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ కేంద్ర ప్రభుత్వం వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని అన్నారు.

దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపించిన సీఎం, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎంపీలు గెలిచినా కేంద్ర కేబినెట్‌లో వారికి సముచిత స్థానం కల్పించలేదన్నారు. దక్షిణాది ప్రజలను రెండో శ్రేణి పౌరుల్లా చూడొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...