Latest News

హైదరాబాద్‌ ట్రాఫిక్ కష్టాలకు చెక్... సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్లాన్!

posted on: Mar 23, 2026 2:28PM

 

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన 'సిగ్నల్ ఫ్రీ' నగరంగా మార్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. నగరంలోని ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి, వాహనదారులకు సులభతర ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రహదారులు, భవనాల శాఖ అధికారులకు ఆయన పలు దిశానిర్దేశాలు చేశారు.

నగరంలో పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా జంక్షన్ల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు మల్టీ లెవల్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, లింక్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఏ మూల నుంచి ప్రయాణం ప్రారంభించినా, ఎక్కడా ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా గమ్యస్థానానికి చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'రోడ్ సెక్టార్ పాలసీ-2047'లో భాగంగానే ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సీఎం వివరించారు. కేవలం నగరం లోపలే కాకుండా, హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఏ జిల్లా కేంద్రానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా హైవేలను అనుసంధానించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రతి జిల్లా కేంద్రం చుట్టూ రింగ్ రోడ్ల నిర్మాణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, వాటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని చెప్పారు.

పరిపాలనాపరమైన అడ్డంకులు ఎదురుకాకుండా జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సీఎం సూచించారు. ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. కేవలం రోడ్లే కాకుండా నగరంలోని చెరువుల పునరుద్ధరణ, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణపై కూడా ఆయన దృష్టి సారించారు.

ఈ అభివృద్ధి పనుల ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మారిపోనున్నాయని, భవిష్యత్తులో ఇది పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, మెట్రో రెండో దశ విస్తరణతో పాటు ఈ సిగ్నల్ ఫ్రీ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ అంతర్జాతీయ నగరాల సరసన నిలుస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...