Latest News
అభాసుపాలవుతోన్న మూడెకరాల భూమి పంపిణీ పథకం
posted on: Mar 15, 2017 5:16PM

తెలంగాణలో దళితులకు మూడెకరాల భూమి పంపిణీ పథకం అభాసుపాలవుతోంది. ఏడాదికేడాది పంపిణీ చేస్తున్న భూమి తగ్గిపోతోంది. గత ఆర్థిక సంవత్సంలో 4500 ఎకరాలు పంచిన ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 621 ఎకరాలే పంచింది. మరో నెలలో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా..లబ్ధిదారుల సంఖ్య కేవలం 241 మందికే పరిమితమైంది. పలు జిల్లాల్లో ఒక్కరికీ కూడా భూమి పంచలేదు. దళితులు అధిక సంఖ్యలో ఉన్న కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భూములు ఉన్నా.. పంపిణీ చేయకపోవడం విమర్శలకు దారితీసింది.
తెలంగాణలో 4లక్షల దళిత కుటుంబాలకు భూములు లేనట్టు సర్కార్ లెక్కలు చెబుతున్నాయి. 2014 ఆగస్టు 15న గోల్కొండ కోట మీద అట్టహాసంగా ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటిదాకా 2వేల 631 మందికి 6913 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. మొదటి సంవత్సరం 1795 ఎకరాల భూమిని 674 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయగా.... రెండో సంవత్సరంలో 1716 మంది లబ్ధిదారులకు 4495 ఎకరాల భూమిని పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 241 మంది అర్హులకు 621ఎకరాలను మాత్రమే పంచింది. మొత్తం మూడేళ్లలో కేవలం 2631 మందికి మాత్రమే భూములు ఇవ్వగలిగింది తెలంగాణ ప్రభుత్వం.
2014-15 ఆర్థిక సంవత్సరంలో సగటును ఒక్కో ఎకరాకు ప్రభుత్వం 4లక్షల 15వేలు చొప్పున ఖర్చు చేయగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున 4లక్షల 78వేలు ఖర్చుచేస్తోంది. ప్రతి ఎకరాకు 63వేలు అంటే 15శాతం భూముల ధరలు పెరిగినట్టయ్యింది. కొన్ని జిల్లాల్లో ఈ ఏడాది భూపంపిణీ పథకం అసలు ప్రారంభమే కాలేదు.
ప్రతి ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సిందిపోయి.. తగ్గుతుండటాన్ని దళిత సంఘాలు, విపక్షాలు తప్పుబడుతున్నాయి. ప్రభుత్వం భూపంపిణీ ప్రక్రియను వేగవంతం చేసి భూములు పంచాలని డిమాండ్ చేస్తున్నారు.


.jpg)



