Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నాడు విధ్వంసం..నేడు నమ్మకం, అభివృద్ధి : సీఎం చంద్రబాబు
posted on: Jun 12, 2026 4:28PM
.webp)
వైసీపీ హయాంలో వ్యవస్థల నిర్వీర్యం..
వెంటిలేటర్పై ఉన్న ఏపీని కాపాడింది కేంద్రమే..
ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ల అరాచక, చీకటి పాలనకు తెరదించుతూ 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన అఖండ విజయంతో రాష్ట్రంలో నిజమైన ప్రజాస్వామ్య పరిపాలన సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక, సామాజిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలే స్వయంగా ముందుకు వచ్చారని ఆయన కొనియాడారు.
కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల కాలపరిమితిని పూర్తి చేసుకున్న సందర్భంగా, తిరుపతి సమీపంలోని దామినేడులో 'రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి - సంక్షేమం' పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ వేదికపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో కూటమి సాధించిన 57 శాతం ఓట్ల వాటాను, 94 శాతం స్ట్రైక్ రేట్ను ప్రస్తావిస్తూ ఇది ప్రజా విజయం అని అభివర్ణించారు. దేశం, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా భావించే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి భాగస్వామ్యం తమకు ఎంతో బల చేకూర్చిందని బాబు పేర్కొన్నారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజా వేదిక కూల్చివేతతోనే అరాచకాలకు పునాది పడిందని చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర నిధులను తప్పుదోవ పట్టించి, సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేసి, అప్పుల కుప్పగా మార్చడమే కాకుండా రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థనూ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వెంటిలేటర్పై ఉన్న ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్లా అండగా నిలిచిందని, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్ వంటి కీలక అంశాల్లో కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని వివరించారు.
రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం 63 లక్షల మంది అర్హులకు ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. దాంతో పాటు 'తల్లికి వందనం' ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఆర్థిక సాయం, 'అన్నదాత సుఖీభవ' కింద రైతులకు ఏటా రూ. 20 వేల పెట్టుబడి సాయాన్ని అందజేస్తూ సంక్షేమ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తున్నామని పేర్కొన్నారు. P4 (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్షిప్) విధానం ద్వారా సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించడమే తమ అంతిమ లక్ష్యమన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా ఎదుగుతోందని, 21వ శతాబ్దం మోదీదేనని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రశంసించారు. 'ఆపరేషన్ సిందూర్' వంటి కార్యక్రమాలతో దేశ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన ఘనత ప్రధానిదేనన్నారు. రాబోయే 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే తిరుగులేని ఆర్థిక, సాంకేతిక శక్తిగా అవతరించడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పరిశ్రమలు, ఉపాధి కల్పనతో రాయలసీమను 'బంగారు సీమ'గా మారుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పుట్టపర్తిలో 5వ తరం ఫైటర్ జెట్ తయారీ కేంద్రం, తిరుపతిలో బుల్లెట్ ఫ్యాక్టరీ రాబోతున్నాయని వెల్లడించారు. వచ్చే నెలలోనే ప్రతిష్టాత్మక రాయలసీమ స్టీల్ ప్లాంట్ను ప్రారంభిస్తామని, జొన్నవాడ ప్రాంతంలో బంగారం వెలికితీత పనులను వేగవంతం చేస్తామని ప్రకటించారు. పచ్చదనం, హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు సుమారు లక్ష కోట్ల రూపాయలతో రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే ప్రణాళికలు సిద్ధమయ్యాయన్నారు.
గత పాలకులు మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించి మూడు ముక్కలాట ఆడారని చంద్రబాబు దుయ్యబట్టారు. తమ ప్రభుత్వానికి మూడు రాజధానులు ముఖ్యం కాదని, మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ఏకైక లక్ష్యమని కుండబద్దలు కొట్టారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని, ప్రజా సుపరిపాలనను మరింత ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.


.webp)



