Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తీరం మనదే..వేటా మనదే...సంపదా మనదే : సీఎం చంద్రబాబు
posted on: May 19, 2026 6:47PM
.webp)
తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్య కారులకు భాగస్వామ్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మత్స్య కారుల సంక్షేమానికి.. వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అలాంటి వారు చేసే ఫేక్ ప్రచారాలను పట్టించు కోవద్దని స్పష్టం చేశారు. నెల్లూరు కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో మంగళవారం మత్స్య కారుల సేవలో కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
వేట నిషేధ సమయంలో 1,30,796 మంది మత్స్య కార కుటుంబాలకు రూ. 261.50 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించారు. మత్స్య కారుల సేవలో కార్యక్రమంతో మత్స్య కారుల కుటుంబానికి రూ.20 వేలు చొప్పున ఆర్ధిక సాయాన్ని అందించారు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలోనే మత్స్య కారుల సేవలో లబ్దిదారుల ఖాతాల్లోకి నిధులు జమ అయ్యాయి. దీంతో తమకు డబ్బులు జమ అయ్యాయంటూ సంతోషం వ్యక్తం చేస్తూ సెల్ ఫోన్లల్లో వచ్చిన మెసేజీలను ముఖ్యమంత్రికి లబ్దిదారులు చూపించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...”సముద్ర తీర ప్రాంతంలో పోర్టులు వస్తే అభివృద్ధి జరుగుతుంది. తీర ప్రాంతంలో జరిగే అభివృద్ధిలో మత్స్య కారులకూ భాగస్వామ్యం ఉండాలి. అభివృద్ధిని మత్స్య కారులు అందిపుచ్చుకునేలా ప్రణాళికలు చేస్తాం. కావలి ప్రాంతంలో సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటు అవుతోంది. దీని ద్వారా స్థానికులకే ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయి. రూ.288 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపడుతున్నామన్నారు.
మత్స్య కారులను ఆర్ధికంగా బలోపేతం చేసేలా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. వీటిపై కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకూ తావులేదు. ఫేక్ ప్రచారాలను నమ్మ వద్దు. ఈ తీరం మనది, బోటూ మనదే.. ఇక్కడ సంపద కూడా మనదే. ఈ విషయంలో రాజీ లేదు. మన తీరప్రాంతానికి పొరుగు రాష్ట్రం వారు ఎవరొచ్చినా సహించేది లేదు. మత్స్యకారుల హక్కులు కాపాడతాం. మన తీరప్రాంతంలో నిఘా పెట్టి పొరుగు రాష్ట్రాల బోట్లు రాకుండా చర్యలు తీసుకుంటాం. తీరం మనదే, బోటు మనదే వేటా మనదే ఇదే సీబీఎన్ మాట.”అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
మత్స్య కారుల సేవలో ఉంటాం... అండగా నిలుస్తాం
“దేశంలో చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. ఇది కొనసాగాలంటే... మత్స్య కారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి... వారికి అండగా నిలవాలి. ఆ దిశగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. మత్స్య కారులకు మేం అండగా ఉంటాం. మెకనైజ్డ్, మోటరైజ్డ్ డీజిల్ పడవలకు లీటరుకు రూ.9 మేర డీజిల్ సబ్సిడీ ఇస్తున్నాం. 2026-27లో రూ.50 కోట్ల విలువైన డీజిల్ సబ్సీడిని మత్స్య కార బోట్లకు అందించాం. రూ.3256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా ప్రభుత్వం నిర్మిస్తోంది.
మత్స్య కారుల రక్షణ కోసం సముద్రంలో 4,550 ట్రాన్స్ పాండర్లను ఏర్పాటు చేసి కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. పడవలు, వలలు, పరిహారం సకాలంలోనే ప్రభుత్వం అందిస్తోంది. 200 మెకనైజ్డ్ బోట్లను మత్స్యకారుల కోసం శాంక్షన్ చేస్తాం. 60 శాతం సబ్సీడీ ఇవ్వటంతో పాటు మిగిలిన మొత్తాన్ని రుణంగా మంజూరు చేస్తామని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అచ్చెన్నాయుడు, ఫరూఖ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


.webp)



