పిల్లలే సంపద పేరుతో త్వరలో కొత్త కార్యక్రమం : సీఎం చంద్రబాబు

posted on: May 16, 2026 8:58PM

 

దేశ ప్రగతిలో పిల్లలే అసలైన సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోందని, జనాభా తగ్గుదల రేటును అరికట్టేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. పిల్లలే సంపద పేరుతో త్వరలో కొత్త కార్యక్రమం చేపడతామని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రకటించారు. పాపులేషన్ మేనేజ్మెంట్ ద్వారా జనాభాను దేశానికి సంపదగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. మూడో సంతానానికి  రూ.30 వేలు, నాలుగో సంతానానికి రూ.40 వేలు ప్రోత్సాహకంగా అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 

చాలామంది ఒక బిడ్డతోనే సరిపెట్టుకుంటున్నారని ఈ కారణంగా చాలా దేశాల్లో జనాభా తగ్గి వృద్ధుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. దీని వల్ల ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని స్పష్టం చేశారు. గతంలో కుటుంబ నియంత్రణ అమలు పై విస్తృతంగా పనిచేశామని.. ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా పిల్లలే సంపద అని పిలుపునిస్తున్నానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ద్వారా జననాల రేటును పెంచేలా చర్యలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు. స్త్రీశిశు సంక్షేమ శాఖ ద్వారా తల్లులకు, పిల్లలకు పౌష్టికాహారం అందించేలా ఆంగన్వాడీ కేంద్రాలను కూడా బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఆర్ధిక సాయం కూడా అందిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...