బాబు విన్నపాలకు మోదీ మనసు కరిగేనా!

posted on: May 17, 2016 3:56PM

 

2014 నాటి పార్లమెంటు ఎన్నికల సమయంలో మోదీ, ఆంధ్రప్రదేశ్‌ మీద అవ్యాజమైన ప్రేమను కురిపించారు. కాంగ్రెస్ మీ రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా, ముందుచూపు లేకుండా చీల్చిపారేసిందనీ... రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా ఆదుకుంటామనీ హామీలు అందించారు. రోజులు గడిచే కొద్దీ ఆంధ్రప్రదేశ్‌ ఊసే మరిచిపోవడం మొదలుపెట్టారు భాజపా నేతలు. ఏదో కొత్త ప్రభుత్వం కదా, కొద్ది రోజులు వేచి చూద్దామని భావించిన తెలుగు తమ్ముళ్ల నెత్తిన పిడుగుపాట్లు మొదలయ్యాయి. అసలు ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్నదే చాలా ఎక్కువనీ, కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం ఎదురుచూస్తే మరిన్ని నిధులు వస్తాయనీ... ఇంక ప్రత్యేక హోదా ఏమిటనీ భాజపా నేతల నుంచి ప్రశ్నలు వినిపించసాగాయి. పరాయి రాష్ట్రంలోని నేతలు ఇలాంటి మాటలు అంటే ఫర్వాలేదు కానీ... కష్టకాలంలో కలిసి ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేతలే, ప్రతిపక్షం కంటే దారుణంగా విమర్శించడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు అంత రాజధాని అవసరమా అంటూ సోము వీర్రాజు వంటి నేతలు నీతులు బోధించసాగారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు దిల్లీ ప్రయాణం సాగింది. ఇవాళ ప్రధానమంత్రి మోదీని కలిసిన చంద్రబాబు ప్రత్యేక హోదా, బడ్జెటులోని లోటును  భర్తీచేయడం, పోలవరం ప్రాజెక్టుకి నిధులు... వంటి 12 అంశాలతో కూడిన నివేదికను ప్రధానికి అందచేశారు. ఆ తరువాత ఓ 20 నిమిషాల పాటు ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రత్యే హోదా విషయంలో ఇప్పటికే భాజపా, తెదెపా మధ్య సంబంధాలు తెగతెంపులైనంత పని అయ్యాయి. అయినా మోదీ ఎప్పటికైనా తన హామీని నెరవేర్చుకుంటారన్న ఆశతో చంద్రబాబు వేచి చూసే ధోరణితోనే ఉన్నారు. కేంద్రంలోని ప్రభుత్వంతో కయ్యానికి దిగితే నష్టపోయేది కొత్తగా ఏర్పడిన రాష్ట్రమే అని చంద్రబాబుకి తెలుసు కాబట్టి... చిక్కుముడులను నిదానంగా విడదీసుకునేందుకే ప్రయత్నిస్తున్నారు. మరి మోదీ ఓ మెట్టు దిగి ఆంధ్రప్రదేశ్‌ మొరను ఆలకిస్తారా లేకపోతే పని గడిచిపోయింది కదా అని ఏపీ తెప్ప తగలేస్తారా అన్నది త్వరలోనే తేలనుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...