పులివెందుల జడ్పీటీసీ గెలవాలి..కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం
posted on Aug 8, 2025 2:44PM

వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయం సాధించాలని కూటమి నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గెలవాలని సంకల్పంతో అందరూ పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ఎన్నికపై కూటమి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన పులివెందులను అభివృద్ధి చేద్దామన్నారు. తెలుగుదేశం హయాంలోనే పులివెందులకు కృష్ణా జలాలను అందించి పంటలకు కాపాడినట్టు గుర్తుచేశారు.
కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. జగన్ కూడా చేయని విధంగా పులివెందులను అభివృద్ధి చేద్దామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను ఇటు అధికారంలోని కూటమి పార్టీలు, అటు వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా తుమ్మల హేమంత్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు. ఇరు పక్షాలకు చెందిన కీలక నేతలు పులివెందులలో మకాం వేసి హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.