ఆక్వా రంగంలో ఏపీ నెంబర్ 1 : సీఎం చంద్రబాబు

posted on: Jun 5, 2026 4:29PM

 

దేశంలోని మొత్తం మత్స్య సంపదలో 28 శాతం ఒక్క ఏపీ నుంచే వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి సీ-ఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ వర్క్ షాపులో ఆయన పాల్గొన్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. గత పదేళ్లలో ఈ రంగంలో 5 శాతం నుంచి 70 శాతం పెరుగుదల కనిపిందని చెప్పారు.

భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదేనని, భారత బ్లూ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో ఆక్వా రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ సీ-ఫుడ్ ఎగుమతుల వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, రాష్ట్ర ఆక్వా రంగ అభివృద్ధికి సంబంధించిన దార్శనికతను, భవిష్యత్ కార్యాచరణను వివరించారు.

భారతదేశంలో చేపల ఉత్పత్తి, రొయ్యల ఉత్పత్తి, సముద్ర ఆహార ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతోందని చంద్రబాబు వెల్లడించారు. దేశ మొత్తం చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా 28 శాతం కాగా, రొయ్యల ఉత్పత్తిలో 66 శాతం రాష్ట్రానిదేనని తెలిపారు. అలాగే దేశ సముద్ర ఆహార ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో 38 శాతం, అంటే సుమారు రూ.28 వేల కోట్లకు పైగా ఏపీ నుంచే సమకూరుతోందన్నారు.

ప్రపంచ సీ-ఫుడ్ వ్యాపారంలో భారత్ వాటా ప్రస్తుతం కేవలం 5 శాతమేనని, దీనిని మరింత పెంచుకునే అవకాశాలు అపారంగా ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే దేశ ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ఆక్వా రంగ సమగ్రాభివృద్ధి కోసం అమరావతి, భీమవరం, కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం, నెల్లూరు ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రత్యేక ‘ఆక్వా కారిడార్’ను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ కారిడార్‌లో పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, ఆధునిక సాంకేతికతతో కూడిన సమగ్ర ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అత్యల్ప వ్యయంతో అత్యధిక ఉత్పత్తి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న సీఎం, “పాండ్ టు పోర్ట్ – ఫార్మర్ టు గ్లోబల్ కన్స్యూమర్” విధానంతో ముందుకు సాగుతామని చెప్పారు. ‘ఆంధ్రా రొయ్య – ఇండియా సీ-ఫుడ్’ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఆక్వా రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కేంద్ర మత్స్య శాఖ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని 15 రోజుల్లో కేటాయిస్తామని వెల్లడించారు. కాకినాడ పోర్టు ఆధునికీకరణకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఇచ్చిన హామీపై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు, మెగా సీ-ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తోందని గుర్తుచేశారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...