Latest News

మూసీ తంతు.. రేవంతు పూర్తి చేయగలరా?

posted on: Mar 14, 2026 4:20PM

మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టుతో భాగ్యనగరం మరో అద్భుత ఆవిష్కరణకు వేదిక కానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రభుత్వం మూసి పునరుద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే హైదరాబాద్ మహానగరం నిజంగానే విశ్వనగరంగా మారిపోతుందనడంలో సందేహం లేదు. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే.. ఇక హైదరాబాద్ కు సాగు, తాగు నీటి కొరత అన్నదే ఉండదు.  కుతుబ్‌షాహీలు, నిజాంల కాలంలో మూసీ నది అప్పటి నగర జీవనాధారంగా మూసీ నది ఉండేది. అదొక జీవనదిగా ఉండేది. అయితే తరువాత తరువాత  మూసీ నది ప్రాధాన్యత కోల్పోయింది. ఇందుకు కాలుష్యం, పాలకుల నిర్లక్ష్యం, ప్రణాళికా రహితంగా నగర విస్తరణ.. ఇలా ఎన్నో ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి.

 ఇప్పుడది ఒక మురికి ప్రవాహంగా మారిన సంగతి కళ్లెదుటే సక్షాత్కరిస్తున్నది. అటువంటి మూసీ నదికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రేవంత్ సర్కార్  ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది.  ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీనది ప్రక్షాళన, నీటి శుద్ధి, నది పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపట్టనుంది. ముఖ్యంగా మూసీలో  కాలుష్య జలాలు కలవకుండా  పరిశ్రమల వ్యర్థాలను నియంత్రించడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యాలు. ఈ మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు సామాజిక, ఆర్థిక అంశంగా మాత్రమే పరిగణించడానికి వీల్లేదు. ఇది  కచ్చితంగా ఒక రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న అంశం కూడా.   మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు వచ్చే ఎన్నికలలో ఒక ప్రధాన ప్రచారాంశంగా మారుతుందనడంలో సందేహం లేదు.  

ఈ ప్రాజెక్టు  పూర్తయితే.. పర్యాటకంగా హైదరాబాద్ మరో లెవెల్ కు చేరుకుంటుందన్నది పరిశీలకుల అంచనా.  దాంతో  స్థానికులకు ఉపాధి అవకాశాలు  పెరుగుతాయి, తద్వారా నగర వాసుల జీవన ప్రమాణాలు మెరుగు అవుతాయి. అయితే ఇది తలుచుకున్న వెంటనే పూర్తయ్యే ప్రాజెక్టు కాదు.. దీర్ఘకాళిక ప్రణాళిక. నదీ ప్రవాహాన్ని స్థిరీకరించడం, నీటిని శుద్ధి చేయడం, ఆక్రమణలను తొలగించి, నిర్వాశితులకు పునరావాసం కల్పించడం సహా ఎన్నో ఎన్నెన్నో అంశాల ఈ బృహత్ఫ్రణాళికలో అంతర్భాగమై ఉన్నాయి.  

వాస్తవానికి మూసీకి చారిత్రక నేపథ్యం ఉంది. కుతుబ్ షాహీలు, నిజాంల కాలంలో హైదరాబాద్ కు ప్రధాన నీటి వనరు మూసీ నదే. ఈ నది నీరే సాగు, తాగు, వాణిజ్య అవసరాలకు ఉపయోగపడేది. నదీ పరిసరాలన్నీ పరిశుభ్రదతతో కళకళలాడుతుండేవి. అయితే తరువాత తరువాత మూసీ నది కాలుష్యం, ఆక్రమణల బారిన పడి వైభవాన్ని కోల్పోయింది. ఆక్రమణలతో కుంచించుకుపోయి ఇప్పుడది కేవలం మురికి ప్రవాహంగా మిగిలింది.  

ఆ పరిస్థితి మార్చాలని ప్రస్తుతం రేవంత్ సర్కార్ కంకణం కట్టుకుంది.  మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు  మూసీకి పూర్వ వైభవం తీసుకువచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నది ప్రక్షాళన, పరిసరాల్లో అందమైన పార్కులు, నడక మార్గాలు, మౌలిక సదుపాయాలు అభివృద్ధికి తెలంగాణ సర్కార్ ప్రణాళికలు రూపొందించింది. అయితే ఈ ప్రాజెక్టు సాకారం కావాలంటే ప్రజా భాగస్వామ్యం అనివార్యం. ప్రజల సహకారం, భాగస్వామ్యం లేకుండా ఈ ప్రాజెక్టు ముందుకు సాగే అవకాశాలు మృగ్యం.  

అందుకే ప్రక్షాళన ప్రాజెక్టులో నిర్వాసితుల పునరావాసానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పూర్తయితే.. హైదరాబాద్ నగరం విశ్వ పర్యటక కేంద్రంగా మారుతుందనడంలో సందేహం లేదు.  అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు పనులు ఆరంభ దశ మొదలైంది. ఇదెలా ముందుకు సాగుతుంది. రాజకీయ అవరోధాలను రేవంత్ సర్కార్ ఏ విధంగా అధిగమిస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు కు నిధుల కొరత లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నదానిపైనే ఈ ప్రాజెక్టు పురోగతి ఆధారపడి ఉంటుంది.  ఏది ఏమైనా మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై ఒక తెలంగాణ ప్రజలే కాదు.. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలూ ఆసక్తి చూపుతున్నారు. ప్రాజెక్టు ప్రణాళిక మేరకు ఎటువంటి ఆటంకాలూ లేకుండా ముందుకు సాగాలని కోరుకుంటున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...