మధ్యవర్తిత్వంలో ‘ఏఐ’ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

posted on: Apr 12, 2026 5:56PM

 

 న్యాయ వివాదాల పరిష్కార ప్రక్రియలో, ముఖ్యంగా మధ్యవర్తిత్వ (Arbitration) రంగంలో కృత్రిమ మేధ (AI) వినియోగంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆధునిక ప్రపంచంలో సాంకేతికతను పూర్తిగా తోసిపుచ్చలేమని, అయితే దాని వినియోగంలో తగిన జాగ్రత్తలు, నియంత్రణలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. 'ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్' నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో లీగల్ టెక్నాలజీ ప్రాధాన్యత పెరుగుతోందని సీజేఐ పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధి, అంతర్జాతీయ వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వ పాత్ర కీలకమని, దీనిని మరింత వేగవంతం చేసేందుకు ఏఐ వంటి సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని సూచించారు. కేవలం సాంకేతికతను వ్యతిరేకించడం వల్ల ప్రయోజనం ఉండదని, దానికి బదులుగా సవాళ్లను అధిగమించే మార్గాలను అన్వేషించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఏఐ వినియోగంపై ప్రధానంగా వ్యక్తమవుతున్న గోప్యత (Privacy), స్వతంత్ర నిర్ణయాధికారం వంటి ఆందోళనలను సీజేఐ ప్రస్తావించారు. న్యాయపరమైన అంశాల్లో మానవీయ కోణం, విచక్షణ అత్యవసరమని, యంత్రాలు ఇచ్చే తీర్పుల విషయంలో అప్రమత్తత అవసరమని అభిప్రాయపడ్డారు. సాంకేతికత అనేది ఒక మిత్రుడిగా ఉండాలే తప్ప, అది వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్లకూడదని హెచ్చరించారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...