ఐక్యరాజ్యసమితి తీరుతో భారత్‌ బేజారు

posted on: Apr 2, 2016 10:55AM

 

ఉగ్రవాదాన్ని నిర్వచించేందుకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను నిలువరించేందుకు ఐరాస ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని మోదీ విమర్శించిన కొద్ది రోజులకే, ఐరాస మరోసారి తన వైఫల్యాన్ని చాటుకుంది. పఠాన్‌కోట్‌ దాడులతో సహా భారతదేశంలోని పలు ఉగ్రవాద కలాపాలకు పాల్పడుతున్న మౌలానా మసూద్ అజార్‌ను వెనకేసుకు వచ్చి భారత్‌ ఆగ్రహానికి గురైంది. అజార్ జైష్‌ ఏ మహమ్మద్‌ అనే అతివాద సంస్థ పేరుతో పాకిస్తాన్‌ నుంచి తన కార్యకలాపాలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే! అజార్‌ మీద అంతర్జాతీయంగా నిషేధం విధించాలంటూ భారత్ చేసిన విజ్ఞప్తిని ఐరాస తొక్కిపెట్టింది.

 

ఐరాసలో శాశ్వత సభ్యదేశమైన చైనా అభ్యంతరం మేరకే ఈ అడ్డంకి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం మీద విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఐరాస పనితీరు నిష్పక్షపాతంగా లేదని, తీవ్రవాదం మీద పోరు సాగించేందుకు పట్టుదలతో ఉన్నట్లు కనిపించడం లేదని ఘాటుగా విమర్శించారు. మసూద్ అజార్‌లాంటి తీవ్రవాది నుంచి సభ్యదేశాలను కాపాడవలసిన బాధ్యత ఐరాసకు ఉందని గుర్తుచేశారు. ఈ వివాదంలో ఐరాస ఎప్పటిలాగే మౌనంగా ఉండిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...