ఢిల్లీలో మళ్లీ సీఎం vs గవర్నర్..!

posted on: Jun 14, 2016 12:10PM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ల మధ్య గతంలో ఉన్న వివాదాలు సద్దుమణిగి వీరిద్దరూ కలిసిపోయారని అంతా భావించారు. కాని అది నిజం కాదని ఆ వివాదం నీవురుగప్పిన నిప్పులా ఉందని రుజువైంది.  గతేడాది ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఢిల్లీ ప్రభుత్వం కిందకు రాని పోలీసు, శాంతిభద్రతలు, భూమి ఇత్యాది అంశాలకు సంబంధించిన ఫైళ్లను తనకు పంపాలని లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్, కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. దీనికి అభ్యంతరం తెలిపిన కేజ్రీవాల్ ఎలాంటి ఫైళ్లను ఎల్జీ కార్యాలయానికి పంపనవసరం లేదని అన్ని ప్రభుత్వ విభాగాలను ఆదేశించారు. ఆ తర్వాత సీఎస్ నియామకం, జన్‌లోక్ పాల్ బిల్లు, డీఎంసీ సభ్యుల నియామకం, శాంతిభద్రతలు ఇలా ప్రతి అంశంలోనూ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఎల్జీ కార్యాలయం, సీఎం కార్యాలయం ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నాయి. మరోసారి వీరిద్దరి వివాదం బయటకొచ్చింది..తమ ప్రభుత్వం ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా అవినీతి నిరోధక శాఖ, సీబీఐ వంటి సంస్థలతో విచారణలు చేయిస్తూ తమను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారంటూ ప్రధాని మోడీ, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌లపై కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు ఆరోపణలతో లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఓ లేఖను రాశారు. తమ ప్రభుత్వం ఆదివారం నాడు ప్రారంభించిన బాబా సాహెబ్ అంబేద్కర్ మెడికల్ కాలేజీపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏసీబీతో దర్యాప్తు చేయించాలని..అలాగే రికార్డు సమయంలో కళాశాల నిర్మాణం పూర్తి చేసినందుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌పై కూడా విచారణ జరిపించాలని పేర్కొన్నారు. తాను, తన బృందం ప్రజల కోసం కష్టపడుతున్నామని..అయితే తాము చేసే ప్రతి పనికీ అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. చివరిగా మీ తమ్ముడిగా నాదో చిన్న సలహా..ప్రధాని అడుగులకు మడుగులొత్తుతూ మీరు రాజ్యాంగ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నారు. అలా చేసినంత మాత్రాన మోడీ మిమ్మల్ని దేశానికి ఉపరాష్ట్రపతిని చేయబోరని గుర్తు పెట్టుకోండి. అంటూ లేఖలో తన నిరసనను వెళ్లగక్కారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...