భోగాపురం భూ నిర్వాసిత రైతులకు చంద్రబాబు బంపర్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?

posted on: Jul 21, 2026 3:09PM

ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమై వచ్చే నెల 1న ప్రారంభోత్సవానికి ముస్తాబైన  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బంపర్ గిఫ్ట్ ప్రామిస్ చేశారు.  ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు.

ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రాజధాని అభివృద్ధి, ప్రాంతీయ విమానాశ్రయాల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్వాసితుల పాత్ర గుర్తింపునకు చంద్రబాబు నిర్ణయం ఒక మైలురాయిగా నిలుస్తుందని పరిశీలకులు అంటున్నారు.  విజయనగరం జిల్లా పరిధిలో రూపుదిద్దుకున్న భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వచ్చే నెల 1న  ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.  

రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న   నిర్ణయం ప్రకారం, భోగాపురం విమానాశ్రయ భూసేకరణ ప్రక్రియలో తమ పట్టా భూములను, సాగు భూములను అందించిన ప్రతీ ఒక్క   రైతు కుటుంబానికి ఈ వన్-టైమ్ ఫ్రీ ఫ్లైట్ జర్నీ సదుపాయం వర్తిస్తుంది. గతంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణ ప్రాంతంగా ఉన్న తమ సొంత నేల నుంచి నేడు దేశ విదేశాలకు విమానాలు ఎగిరిపోతుంటే, ఆ ప్రయాణంలో తొలి భాగస్వాములుగా ఇక్కడి రైతులే ఉండాలనే ఉద్దేశంతో  చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ పంట పొలాలు ఏ స్థలంలోనైతే ఉండేవో, అదే స్థలంలో రూపుదిద్దుకున్న రన్‌వే పైనుంచి విమానంలో నింగికి ఎగరడం రైతులకు ఒక మరుపురాని అనుభూతిని ఇస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రత్యేక పాస్‌లు, ప్రయాణ మార్గదర్శకాలను త్వరలోనే వెల్లడించనున్నారు.  

Bhogapuram Airport, CBN Free Air Travel, Bhogapuram Farmers

google-ad-img
    Related Sigment News
    • Loading...