ఆస్తినష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక.. అధికారులకు చంద్రబాబు ఆదేశం
posted on Nov 1, 2025 1:02PM
.webp)
మొంథా తుఫాన్తో రైతులు నష్టపోకుండా రాష్ట్రంలో నీట మునిగిన పంట పొలాలను యుద్ధప్రాతిపదికన కాపాడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్ తదనంతర చర్యలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి శుక్రవారం (అక్టోబర్ 31) టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఎక్కడెక్కడ పొలాలు నీట మునిగాయో గుర్తించి శనివారం (నవంబర్ 1) కల్లా మొత్తం నీటిని మళ్లించాలని సీఎం స్పష్టం చేశారు. నియోజకవవర్గాల వారీగా శాటిలైట్ చిత్రాలను విడుదల చేసి... ఎక్కడైతే నీళ్లు నిలిచిపోయాయో అక్కడకి స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లి పరిస్థితిని మెరుగుపరచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
అందరూ కలిసి సమన్వయంతో పని చేయడం ద్వారా క్షేత్ర స్థాయిలో మంచి ఫలితాలు రాబట్టాలని సూచించారు. శాస్త్రవేత్తల సూచనలు తీసుకుని, పంటలు నీట మునగడం వల్ల దిగుబడి తగ్గకుండా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కన్నా ఎక్కువగా 60 శాతం మేర బాపట్ల జిల్లాలోని వ్యవసాయ క్షేత్రాల్లో నీరు నిలిచిపోయిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. బాపట్ల జిల్లాలో మాత్రం ఆదివారం నాటికి పొలాల్లో నీటి నిల్వలు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా అధికారులు చెప్పారు.
మొంథా తుఫాన్తో రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్రానికి వెను వెంటనే ప్రాథమిక నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలనకు కేంద్ర బృందాన్ని ఆహ్వానించాలనీ, తుది నివేదిక సమర్పించేలోగా తక్షణ సాయం అందించేలా కేంద్రాన్ని కోరాలని సూచించారు. ఈ విషయమై తాను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు.